ఏర్పేడు: తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసే అంశంపై శాసీ్త్రయ పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) ప్రతినిధుల బృందం శుక్రవారం ఐఐటీని సందర్శించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన పొదుపు లక్ష్యంగా ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలను అధికారులు అధ్యయనం చేశారు. పర్యటనలో సీఎస్ఐఆర్ సీనియర్ సాంకేతిక అధికారి సి.చంద్రశేఖర్, సీనియర్ పరిశోధన ఫెలో పి.రాజేష్ పాల్గొన్నారు. ఐఐటీ జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ చమన్ మెహతా సమక్షంలో ఈ బృందం ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యసాధ్యాలను నిశితంగా పరిశీలించారు. వ్యర్థాల నిర్వహణ ద్వారా ఇంధనాన్ని తయారు చేసే విధానంపై వారు చర్చించారు. హాస్టళ్లలో ఉత్పత్తి అయ్యే సేంద్రియ వ్యర్థాలను ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చనే అంశంపై అధికారులు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఏర్పేడు డిప్యూటీ ఎంపీడీఓ రమణ కుమార్, పంచాయతీ కార్యదర్శులు పి.ఝాన్సీ రాణి, పి.వెంకటముని, ఇంజినీరింగ్ అసిస్టెంట్ సాధిక్ తదితరులు పాల్గొన్నారు


