చిత్తూరు కార్పొరేషన్: పీఎం సూర్యఘర్ పథకం పనులను వేగవంతం చేసి కనెక్షన్లు త్వరగా ఇవ్వాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాక్షి పత్రికలో సబ్సిడీ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు అలసత్వం పై ‘స్లోలార్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీని పై ఆయన స్పందించారు. కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేశారు. రాయితీ ఇస్తున్న సోలార్ రూఫ్ టాప్ పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో అర్హులైన 21,530 ఎస్సీ, ఎస్టీలకు, కుప్పంలో 2,180 ఎస్సీ, ఎస్టీలకు రెస్కో ఆధ్వర్యంలో సోలార్ ప్యానల్స్ పెట్టాలన్నారు. జిల్లాలో 1,205 ప్యానల్స్ అమర్చడం జరిగిందన్నారు. ఇతర సర్వీసుదారులు సోలార్ మిగులు విద్యుత్ను తిరిగి గ్రిడ్ కు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చున్నారు. మొదట మొత్తం నగదును చెల్లించి తరువాత ప్రభుత్వం రాయితీ పొందే అంశం పై వినియోగదారులకు ఉన్న సందేహాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేయాలన్నారు. మండల, గ్రామ స్థాయి కమిటీలు ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. ఇందుకు ట్రాన్స్కో, నెడ్క్యాప్ అధికారులు కృషి చేయాలన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు రుణ సహాయం నిమిత్తం సంఘాలలోని మహిళలకు బ్యాంక్ల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 2వేల సోలార్ కనెక్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అవకాశమున్న మేర సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రవికుమార్నాయుడు, ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు, నెడ్ క్యాప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామలింగయ్య, నెడ్ క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్, డీపీఓ సుధాకర్రావ్, లీడ్ జిల్లా మేనేజరు హరీష్ పాల్గొన్నారు.


