
రేపు ఎస్వీయూ స్టేడియంలో యోగాంధ్ర
తిరుపతి సిటీ : ఎస్వీయూ ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ భూపతినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 3 వేల మంది విద్యార్థులతో పాటు జిల్లా యంత్రాంగం పాల్గొంటున్న ఈ యోగా కార్యక్రామానికి సుమారు 7 వేల మంది హాజరవుతారని తెలిపారు. 21వ తేదీ ఉదయం 5.45 నుంచి 7.15 వరకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
21, 22న చైన్నె మెమో రైలు రద్దు
నాయుడుపేటటౌన్ : చైన్నె నుంచి నెల్లూరుకు వెళ్లే మెమో రైలు ఈనెల 21, 22 తేదిలలో (శని , ఆదివారం) రద్దు చేసినట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ చిరంజీవి గురువారం తెలిపారు. పోన్నేరి తదితర ప్రాంతాల్లో రైల్వే లైన్ల మరమ్మతుల కార ణంగా మెమో రైలు రద్దు చేసినట్లు రైల్వే ఉన్నతాధికారులు ప్రకటించినట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ వెల్లడించారు.
శ్రీసిటీ సీఎఫ్ఓకు పురస్కారం
శ్రీసిటీ (సత్యవేడు): ముంబైలో ఈనెల 18న జియో వరల్డ్ కన్వెన్షన్లో జరిగిన 8వ వార్షిక బిజినెస్ వరల్డ్ సీఎఫ్ఓ వరల్డ్ ఫైనాన్స్ స్ట్రాటజీ ఎక్సలెన్స్ అవార్డుల్లో శ్రీసిటీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ) ఆర్.నాగరాజన్కు ప్రతిష్టాత్మక బెస్టు సీఎస్ఓ ఇన్ స్మాల్ ఎంటర్ఫ్రైజ్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ ఆర్థిక ప్రణాళిక, పనితీరుకు ఆయనకు అవార్డు దక్కింది.
గురుకులాల ఖాళీ సీట్ల
భర్తీకి చర్యలు
– 25న శ్రీకాళహస్తిలో ప్రవేశ పరీక్ష
తిరుపతి అర్బన్ : జిల్లాలో బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–26కు సంబంధించి 6,7,8,9 తరగతుల్లో ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నట్లు జిల్లా కోఆర్టినేటర్ టి. పద్మజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలుర పాఠశాలలకు సంబంధించి నాయుడుపేట, చిల్లకూరు, కోట, వాకాడు గురుకుల స్కూల్లోనూ, అలాగే బాలికలకు సంబంధించి పుదూరు, సూళ్లూరుపేట,డక్కిలి, సత్యవేడు, శ్రీకాళహస్తి, పుత్తూరు పాఠశాల్లోని మిగులు సీట్లు ఉన్నాయని చెప్పారు. వాటిని భర్తీ చేయడానికి ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీకాళహస్తిలోని బాలికల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.