గోల్కొండ (హైదరాబాద్): డబ్బులు విత్డ్రా చేయడానికి ఏటీఎం సెంటర్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి అది మృత్యుకుహరంగా మారింది. ఏటీఎం సెంటర్ డోర్ లాక్ కావడంతో ఊపిరి ఆడక గుర్తు తెలియని వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గురువారం ఉదయం మెహిదీపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని న్యూ మల్లేపల్లిలో ఈ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తన ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఓ వ్యక్తి విజయనగర్ కాలనీ న్యూ మల్లేపల్లిలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎం సెంటర్కు వెళ్లాడు.
డబ్బులు తీసుకున్న అనంతరం ఆ వ్యక్తి ఏటీఎం నుంచి బయటకు రావడానికి తలుపు తెరిచాడు. అయితే డోర్ సెల్ఫ్ లాక్ కావడంతో అది ఎంత ప్రయత్నంచినా తెరుచుకోలేదు. దీంతో లోపల చిక్కుకుపోయిన ఆ వ్యక్తి ఉపిరి ఆడక ఏటీఎం సెంటర్లోనే మృతి చెందాడు. చాలా సేపటికి మరో వ్యక్తి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎం సెంటర్కు వచ్చాడు.
అప్పటికే ఏటీఎం సెంటర్లో చిక్కుకున్న వ్యక్తి కిందపడి ఉండడం చూసి ఆయన స్థానికులను పిలిచాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఏటీఎం సెంటర్ డోర్ను పగలగొట్టి ఆ వ్యక్తిని పరిశీలించారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


