
తల్లిదండ్రులు మందలించారని ఉరేసుకున్న అక్కాచెల్లెళ్లు
హైదరాబాద్: తల్లిదండ్రులు మందలిస్తున్నారనే కారణంతో అక్కాచెల్లెళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్పెక్టర్ ఎం.సుధాకర్ కథనం ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్, రమణమ్మ దంపతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో స్థిరపడ్డాడు.
వీరికి వెనీల (17), అఖిల(16) సంతానం. వీరు ఇంటర్ ద్వితీయ, ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. డిఫెన్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసే వెంకటేశ్ను మూడు నెలల కోసం బాలాపూర్ ఆర్సీఐకి బదిలీ చేశారు. దీంతో వారు మూడు వారాల క్రితం కుటుంబంతో సహా వచ్చి మల్లాపూర్లోని శు¿ోదయ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా కుమార్తెలు అప్పుడప్పుడు ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్తుండడంతో తల్లిదండ్రులు మందలించేవారు.
ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం వెంకటేశ్ డ్యూటీకి, అతని భార్య కిరాణా దుకాణానికి వెళ్లిన సమయంలో ఇద్దరు కుమార్తెలు వెంటిలేటర్ గ్రిల్స్కు చున్నీలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాసేపటికి ఇంటికి వచ్చి చూసిన రమణమ్మ ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహేశ్వరం ఏసీపీ జానకీ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. గతంలో వెనీల బెంగళూరులో అదృశ్యం కావడంతో వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారాల కారణంగానే తల్లిదండ్రులు మందలించినట్లుగా విశ్వసనీయ సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.