
ఝరాసంగం(జహీరాబాద్): సైకిల్ కొనుక్కుంటాం.. మాకు రుణం ఇవ్వండి. తాకట్టుగా తమ వద్ద ఉన్న బంగారం పెడుతామని చిన్నారులు బ్యాంకు మేనేజర్ను కోరారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మండల పరిధిలోని బర్దీపూర్కు చెందిన దేవాన్ష్, రహస్య తల్లి సునీతతో కలిసి దసరా సెలవులలో అదే గ్రామంలోని కెనరా బ్యాంకుకు వెళ్లారు.
వారి తల్లి.. బ్యాంకులో మహిళా సంఘం డబ్బులు తీసుకునేందుకు వచ్చారు. బ్యాంకులో డబ్బులు ఇస్తారన్న విషయం తెలుసుకున్న చిన్నారులు.. బ్యాంకు మేనేజర్ దగ్గరకు వెళ్లి.. ఆడుకునేందుకు సైకిల్ కొనుక్కుంటాం.. డబ్బులు ఇవ్వండని అడిగారు. ఆశ్చర్యానికి గురైన మేనేజర్.. తాకట్టుగా ఏం పెడతారని ప్రశ్నించగా.. తమ దగ్గర భూమి ఉంది.. బంగారం కూడా ఉందని సమాధానం ఇచ్చారు. మేనేజర్ నవ్వుతూ చిన్నారులను తిరిగి ఇంటికి పంపించారు.