
హైదరాబాద్, సాక్షి: పార్టీని నమ్ముకున్నవారికి బీజేపీ నిరంతరం అండగా నిలుస్తుందని, అందుకు తాను ఒక ఉదాహరణ అని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు పేర్కొన్నారు. అలాగే బీజేపీ విధానాలు, నిర్ణయాలు నచ్చనివారు పార్టీని వీడినా నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ అభివృద్ధికి పని చేసిన ప్రతీఒక్కరికీ కచ్చితంగా అవకాశాలు వస్తాయని రాంచందర్రావు పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రాంచందర్రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , ఎంపీ డీకే అరుణ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. దీనికి ముందు ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో అందరూ ఒకటేనని, తమ మధ్య అభిప్రాయ బేధాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ లేదని రాంచందర్రావు ఆరోపించారు.
మతం ఆధారంగా తాము ఏ బిల్లును ఆమోదించబోమని, అసెంబ్లీలో మా పార్టీ ఎమ్మెల్యేలు బీసీ బిల్లుకు మద్దతు తెలిపారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎక్కడని ప్రశ్నించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పుడు ఏమైందని రాంచందర్రావు కాంగ్రెస్ను నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనులు చేయలేక తప్పులను తమపై నెడుతున్నదన్నారు. ప్రతీసారి ఢిల్లీ వెళ్లినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారన్నారు. లోకల్ బాడీలకు కేంద్రం ఇచ్చిన నిధులు ఏం చేశారని రాంచందర్రావు ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేత రాజీనామా చేయించాలని, అప్పుడు బీసీని సీఎం చేస్తే, తన పదవిని రాజీనామా చేస్తానని రాంచందర్రావు సవాల్ విసిరారు.
