సర్కారు వారి మాట  | TRS Govt To Take Over Vacant Lands Of Industries TSIIC | Sakshi
Sakshi News home page

సర్కారు వారి మాట 

Feb 13 2022 3:22 AM | Updated on Feb 13 2022 11:01 AM

TRS Govt To Take Over Vacant Lands Of Industries TSIIC - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఏళ్లుగా కంపెనీలు నెలకొల్పని పరిశ్రమల నుంచి ప్రభుత్వ భూముల స్వాదీనానికి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాలకల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) రంగం సిద్ధం చేస్తోంది. గ్రేటర్‌కు ఆనుకొని హెచ్‌ఎండీఏ పరిధిలో సుమారు రెండువేల ఎకరాల వరకు ఖాళీ స్థలాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ స్థలాలను తిరిగి కంపెనీలు నెలకొల్పేవారికి కేటాయించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో ఎకరం మొదలు వంద ఎకరాలకు పైగా భూములున్న కంపెనీలుండడం గమనార్హం.

ఈ ప్రాంతాల్లోనే అత్యధికం... 
రెండేళ్ల క్రితం టీఎస్‌ఐఐసీ నుంచి స్థలాలను దక్కించుకున్న పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, కంపెనీల యజమానులు ఇప్పటికీ కంపెనీలను నెలకొల్పలేదు. ఇలా నిరుపయోగంగా ఉన్నవిలువైన ప్రభుత్వ స్థలాలు.. ప్రధానంగా  ర్యావిర్యాల ఫ్యాబ్‌సిటీ, మామిడిపల్లిలోని హార్డ్‌వేర్‌పార్క్, నానక్‌రామ్‌గూడలోని ఐటీపార్క్, నాచారం పారిశ్రామిక వాడ, పాశమైలారం, పటాన్‌చెరు ప్రాంతాలున్నాయి.  

గతంలో కేటాయింపులిలా.. 
♦ నాలుగేళ్లుగా టీఎస్‌ఐఐసీ సుమారు 4,169 ఎకరాల భూములను 2,290 కంపెనీలకు కేటాయించింది. ఇందులో 95 సంస్థలు ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారివి. ఈ కంపెనీలు పూర్తిస్థాయిలో ఏర్పాటైతే రాష్ట్రానికి సుమారు రూ.56,597 కోట్ల పెట్టుబడుల వెల్లువతోపాటు..1.50 లక్షల మందికి ఉపాధి దక్కనుందని టీఎస్‌ఐఐసీ వర్గాలు చెబుతున్నాయి. ఆయా కంపెనీలు ఏర్పాటు చేయని సంస్థల నుంచి భూములు స్వా«దీనం చేసుకొని తిరిగి ఇతర సంస్థలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేయడంతో ఈ మేరకు టీఎస్‌ఐఐసీ కార్యాచరణ సిద్ధంచేస్తోంది.  

♦ ఇప్పటికే కొన్ని కంపెనీల నుంచి భూములు స్వా«దీనం చేసుకోగా..సదరు యజమానులు కోర్టులను ఆశ్రయించడం గమనార్హం. గత ఏడేళ్లుగా టీఎస్‌ఐఐసీ పారిశ్రామిక వాడల ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల ఎకరాలతో భూబ్యాంకును ఏర్పాటు చేయనుంది.  

♦ గత ఏడేళ్లుగా 18 ప్రాంతాల్లో 19,961 ఎకరాల్లో  పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దడంతోపాటు మౌలిక వసతులు కల్పించింది . మరో 15,620 ఎకరాలను పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వీలుగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో రావిర్యాల, మహేశ్వరంలోని హార్డ్‌వేర్‌ క్లస్టర్, సుల్తాన్‌పూర్‌లోని మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌లున్నాయి. రాబోయే రెండేళ్లలో 80 ప్రాంతాల్లో ప్రత్యేకంగా పారిశ్రామిక వాడలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్‌ఐఐసీ వర్గాలు 
చెబుతున్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement