హైదరాబాద్ నుంచి మూడో వంతుకుపైగా తగ్గనున్న ప్రయాణ సమయం
సాకారం కానున్న హైదరాబాద్ – ముంబై, చెన్నై, బెంగుళూరు కారిడార్లు
ఇప్పటికే డీపీఆర్ పూర్తి చేసుకున్న హైదరాబాద్ – ముంబై ప్రాజెక్టు రెండుగా విభజన
గంటకు 320 కి.మీ. వేగం
ఎలివేటెడ్, భూగర్భ పద్ధతుల్లో కారిడార్ల నిర్మాణం
ఒక్కో కారిడార్కు సుమారు రూ.లక్షన్నర కోట్ల వ్యయం
సాక్షి, హైదరాబాద్: దేశ రైల్వే చరిత్రలోనే ఇదో ముందడుగు. ప్రస్తుతం ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు పూర్తికావస్తున్న దశలో, ఒకేసారి ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను పట్టాలెక్కించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో మూడు హైదరాబాద్తో అనుసంధానమవడం విశేషం. బుల్లెట్ రైలు ప్రాజెక్టు తరహాలోనే వీటి నిర్మాణం ఉండనుంది. హైదరాబాద్–పుణె, హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగుళూరు మధ్య ఎలివేటెడ్ పద్ధతిలో ఇవి రూపొందనున్నాయి.
ఒక్కో ప్రాజెక్టు దాదాపు రూ.లక్షన్నర కోట్ల భారీ వ్యయంతో రూపొందనున్నాయి. ఇవి పూర్తయితే, ప్రస్తుతం రైలు మార్గంలో ఆ మూడు నగరాలకు అవుతున్న ప్రయాణ సమయం మూడో వంతుకుపైగా తగ్గిపోనుంది. ప్రస్తుతం 13 గంటల చెన్నై ప్రయాణ సమయం మూడు గంటలకు, బెంగుళూరుకు 9 గంటలకు బదులు రెండు గంటల్లో, పుణెకు ఎనిమిది గంటలకు బదులు రెండు గంటలలోపు సమయంలోనే చేరుకోవచ్చు. ఇది రైలు రవాణాలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుంది.
‘హైదరాబాద్–ముంబై’రెండు భాగాలుగా...
హైదరాబాద్–ముంబై మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్కు గతంలోనే రైల్వే శాఖ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించిన డీపీఆర్ కూడా పూర్తయింది. ఇప్పుడు దాన్ని రెండు భాగాలు చేసి, రెండు కారిడార్లుగా నిర్మించనున్నారు. ఆదివారం కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన ఏడు హైస్పీడ్ రైలు కారిడార్లలో రెండు ఇవే. గతంలో హైదరాబాద్–ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్గా ఉన్న ప్రాజెక్టును ఇప్పుడు హైదరాబాద్–పుణె, పుణె–ముంబైగా మార్చారు.
» హైదరాబాద్–పుణె–ముంబై కారిడార్ నిర్మాణానికి గతంలోనే రంగం సిద్ధమైంది. 760 కి.మీ.నిడివితో ఉండే
ఈ ప్రాజెక్టు నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉంది.
» 2020 మార్చిలో ట్రాఫిక్ డిమాండ్ ఫోర్కాస్టింగ్, ప్రిలిమినరీ ఇంజినీరింగ్ సర్వేలు, జియోటెక్నికల్ అసెస్మెంట్లు నిర్వహించారు. మార్గం, మ్యాపింగ్, మట్టి పరీక్షలు, ఎలివేటెడ్/అండర్గ్రౌండ్ సెక్షన్ల అంచనా వ్యయాన్ని ప్రాథమికంగా రూపొందించారు. 2020 చివరి నుంచి 2021లో హైవే ఇంజినీరింగ్ మాగి్నట్యూడ్ కన్సార్టియం, ట్రాన్స్లింక్ కన్సల్టెంట్స్ కాంట్రాక్టర్లు జనరల్ అలైన్మెంట్ డ్రాయింగ్స్, యుటిలిటీ సర్వే (ఓవర్హెడ్, అండర్గ్రౌండ్ యుటిలిటీలు), పవర్ సోర్సింగ్ ఆప్షన్లు గుర్తించారు.
» ఈ కారిడార్కు ప్రయాణికుల డిమాండ్ అంచనాలు, పర్యావరణ ప్రభావ అంచనాలు కూడా రూపొందించారు. ఇప్పటికే డీపీఆర్ను కూడా రూపొందించి రైల్వే బోర్డుకు అందజేశారు. అది బోర్డు పరిశీలనలో ఉంది.
» మహారాష్ట్ర, తెలంగాణలో 250–300 గ్రామాలు ప్రభావితమవుతాయని అంచనాకొచ్చారు. లైడార్ సర్వే కూడా చేశారు.
750 మంది ప్రయాణికులు
ప్రస్తుతం ముంబైకి హైదరాబాద్ నుంచి రైలు మార్గంలో 14 గంటల సమయం అవుతుండగా, హైస్పీడ్ రైలు ద్వారా కేవలం మూడు గంటల్లోనే గమ్యం చేరుకునే వీలుంటుంది. ఈ రైలు 350 కి.మీ.గరిష్ట వేగ సామర్థ్యం ఉంటుండగా, ఆపరేషనల్ స్పీడ్ 320 కి.మీ.గా ఉంటుందని అప్పట్లో అధికారులు పేర్కొన్నారు. ఇది స్టాండర్డ్ గేజ్ (1,435 మి.మీ.), 25 కేవీ ఏసీ ఓవర్హెడ్ ట్రాక్షన్తో ఉంటుంది. ఎలివేటెడ్, అండర్గ్రౌండ్తో కలిపి కారిడార్ ఉంటుంది. ఈ రైల్లో 750 మంది వరకు ప్రయాణికులు వెళ్లే వీలుంటుంది.
» ప్రతిపాదిత స్టేషన్లు (మొత్తం 11) ఇలా: హైదరాబాద్, జహీరాబాద్, కలబురిగి, సోలాపూర్, పండరీపూర్, అక్లోజ్, దౌండ్, పుణె, లోనావాలా, నవీ ముంబై, కుర్లా కాంప్లెక్స్, బాంద్రా, ముంబై.
మూడు గంటల్లో చెన్నై...
హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రతిపాదన రెండేళ్లుగా ఉంది. గతేడాది ఓ అలైన్మెంటును రూపొందించిన రైల్వే శాఖ తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. రైట్స్ లిమిటెడ్ ఫైనల్ అలైన్మెంట్ సర్వే ట్రాఫిక్ పొటెన్షియల్ అనాలిసిస్ నిర్వహించింది. తమిళనాడు అభ్యర్థన మేరకు అలైన్మెంట్ను సవరించి, తిరుపతి స్టేషన్ను చేర్చారు. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆర్వీ అసోసియేట్స్, జీఎస్ఎల్ అసోసియేట్స్లకు అలైన్మెంట్ డిజైన్, లైడార్ సర్వే కాంట్రాక్టులు ఇచ్చారు. ప్రాథమిక డీపీఆర్ను రూపొందించగా, తుది డీపీఆర్ను సిద్ధం చేయాల్సి ఉంది.
» రెండు నగరాల మధ్య 710 కి.మీ. దూరం ఉండగా, 12–14 గంటల ప్రయాణ సమయం పడుతోంది. హైస్పీడ్ రైల్లో ఆ దూరాన్ని కేవలం 3 గంటల్లోనే చేరుకోవచ్చని అంచనా.
» హైదరాబాద్–బెంగళూరు కారిడార్ను కూడా గతేడాది ప్రతిపాదించారు. 2025 సెపె్టంబర్లో సర్వే కసరత్తు ప్రారంభించారు. రెండు నగరాల మధ్య 626 కి.మీ. దూరం ఉండగా, ప్రస్తుతం రైళ్లు 8 గంటలను మించి సమయం తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఆ దూరాన్ని రెండు గంటల్లోనే చేరుకోవచ్చు. ఎలివేటెడ్ పద్ధతిలో హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రూ.1.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా.
సొంత రైళ్లు
ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో తొలుత జపాన్ తన సొంత తయారీ బుల్లెట్ రైళ్లను ఉచితంగా అందివ్వబోతోంది. వాటితోనే ప్రాజెక్టు సర్వీసు మొదలవుతుంది. కానీ, తదుపరి హైస్పీడ్ రైలు కారిడార్లలో పరుగుపెట్టే రైళ్లను మాత్రం మన రైల్వే సొంతంగా తయారు చేసే యోచనలో ఉంది. ఇందుకు ప్రత్యేక టెక్నాలజీని సమకూర్చుకునే ప్రయత్నంలో ఉంది. వందేభారత్ రైళ్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారతీయ రైల్వే.. హైస్పీడ్ రైళ్ల తయారీపై దృష్టి సారించింది.


