
సోషల్ మీడియాలో కాదు ప్రజల్లోకి వెళ్లండి.. ప్రతిపక్షాల అవాస్తవాలను తిప్పి కొట్టండి
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోటీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్
సాక్షి, హైదరాబాద్: యూత్ కాంగ్రెస్ నాయకులే సైనికులని...పార్టీని రక్షణ కవచంలా కాపాడాల్సింది వారేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు. యూత్ కాంగ్రెస్లో కష్టపడి పనిచేసిన వారికి పార్టీ మంచి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. శనివారం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాం«దీభవన్లో రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్గౌడ్ మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ నాయకత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన స్థానం కల్పిస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి ప్రచారం చేయడంలో యూత్ కాంగ్రెస్ తగిన పాత్ర పోషించలేకపోతోందన్నారు. సోషల్మీడియా మీద యూత్కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేయాలని, మరింత ఉత్తేజపూరితంగా ముందుకెళ్లాలని సూచించారు. హెచ్సీయూ భూముల విషయంలో ప్రతిపక్షాలు ఏఐ టెక్నాలజీతో అనైతికంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
నేను, మహేశ్గౌడ్ ఎన్ఎస్యూఐ నుంచి ఎదిగిన వాళ్లమే: మంత్రి పొన్నం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తనతోపాటు మహేశ్గౌడ్ కూడా ఎన్ఎస్యూఐ, యూత్కాంగ్రెస్ నుంచి ఎదిగిన వారమేనని చెప్పారు. ఓపికగా కష్టపడి పనిచేయాలని, కొట్లాడి గెలవాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలన్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు సోషల్మీడియా ఒక్కటే అస్త్రం కాదని, ప్రజల్లోకి నేరుగా వెళ్లడం ద్వారా వారికి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై మరింత అవగాహన కల్పించాలని కోరారు.
అవాస్తవ ప్రచారాలను తిప్పికొట్టాలని, రాజీవ్ యువవికాసం లాంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్కుమార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్చార్జ్ సురభి ద్వివేది, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి, యూత్కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి శ్రవణ్రావు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్గౌడ్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెలగద్దర్ తదితరులు పాల్గొన్నారు.