ఆంగ్ల భాషపై విద్యార్థులకు తెలంగాణ గవర్నర్‌ సందేశం | Telangana Governor says English skills should be improved while mother tongue must be protected | Sakshi
Sakshi News home page

ఆంగ్ల భాషపై విద్యార్థులకు తెలంగాణ గవర్నర్‌ సందేశం

Jun 19 2026 9:33 PM | Updated on Jun 19 2026 9:33 PM

Telangana Governor says English skills should be improved while mother tongue must be protected

సాక్షి,హైదరాబాద్‌: విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందిస్తూనే వారి మాతృభాషలు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని  గవర్నర్  శివ ప్రతాప్ శుక్లా ఉపాధ్యాయులకు సూచించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన “రెండు వారాల ఆంగ్ల భాషా ప్రావీణ్యత కార్యక్రమం”లో పాల్గొన్న ఉపాధ్యాయులతో గవర్నర్ శుక్రవారం లోక్ భవన్‌లో ముచ్చటించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఉపాధ్యాయులకు గవర్నర్ ధృవపత్రాలను అందజేసి అభినందించారు.

హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గిరిజన సంక్షేమ నివాస విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఆంగ్ల భాషా బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా నిర్వహించబడింది. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి మద్దతుగా గవర్నర్ విచక్షణ నిధుల నుంచి రూ.12.80 లక్షలు లోక్ భవన్ మంజూరు చేసింది. కార్యక్రమంలో 50 మంది ఉపాధ్యాయులు, ఐదుగురు ఈఎఫ్ఎల్‌యూ అధ్యాపకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల భావప్రసార, బోధనా సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈఎఫ్ఎల్‌యూ మరియు గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్న కృషిని అభినందించారు. ఉపాధ్యాయులలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెరగడం ద్వారా గిరిజన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడి, ఉన్నత విద్యా, ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని గవర్నర్ అన్నారు. ఇటువంటి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు విద్యాపరమైన అంతరాలను తగ్గించడమే కాకుండా, గిరిజన ప్రాంతాల విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి మద్దతుగా  లోక్ భవన్ నిధుల మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

“శిక్షణ పొందిన 56 మంది ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఆదర్శంగా నిలవాలి. నాణ్యమైన విద్య ద్వారా గిరిజన విద్యార్థుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి మనమందరం కలిసి పనిచేయాలి. గిరిజన సంక్షేమానికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి లోక్ భవన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని గవర్నర్ పేర్కొన్నారు. మాతృభాషలను, గిరిజన సమాజాల సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూనే, పోటీ ప్రపంచంలో రాణించగల సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించేలా బోధన సాగాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన ఉపాధ్యాయులను గవర్నర్ అభినందించి, శిక్షణ ద్వారా పొందిన జ్ఞానం, నైపుణ్యాలను విద్యార్థుల ప్రయోజనం కోసం సమర్థవంతంగా వినియోగించాలని కోరారు.

కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్, ఈఎఫ్ఎల్‌యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగరాజు, గవర్నర్ సంయుక్త కార్యదర్శి కె. శశికిరణా చారి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజా రామ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement