
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రులు జూపల్లి, పొంగులేటి, వేం నరేందర్రెడ్డి, డీజీపీ
మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీలను చిన్నపాటి లోటుపాట్లు కూడా లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. మే 10 నుంచి 31 వరకు జరిగే ప్రపంచస్థాయి పోటీల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఉపకరించే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. పోటీదారులతోపాటు దేశ, విదేశాల నుంచి ఈవెంట్ కవరేజీకి దాదాపు 3 వేల మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.
వివిధ దేశాల నుంచి పోటీలకు వచ్చే వారిని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో స్వాగతించాలన్నారు. మిస్వరల్డ్– 2025 ఏర్పాట్లపై సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్షించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, డీజీపీ జితేందర్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ సీపీ జి.సుదీర్బాబు, ఏడీజీపీ స్టీఫెన్ రవీంద్రతోపాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
పోటీల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఒక నోడల్ ఆఫీసర్ ఉండాలని సీఎం సూచించారు. మే 10వ తేదీన సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్డేడియంలో జరిగే ప్రారంబోత్సవం నుంచి... 31వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలే వరకు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. చార్మినార్, లాడ్బజార్, సచివాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లు, భద్రత కల్పించాలన్నారు.
అనుకోని అవాంతరాలు ఎదురైతే..
అనుకోని అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా, వాటిని అధిగమించే ప్రత్యామ్నాయ ప్రణాళికలను అధికారులు రూపొందించుకోవాలని ఆదేశించారు. మహిళా సాధికారతను చాటిచెప్పేలా రాష్ట్రంలో ఐకేపీ మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ సందర్శనతోపాటు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
విదేశీ అతిథులు బస చేసే హోటళ్లతోపాటు గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సచివాలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతోపాటు వివిధ రంగాల్లో ప్రముఖులను ప్రభుత్వం తరఫున ప్రారంబోత్సవానికి ఆహ్వనించాలని సూచించారు.