ఈ గడ్డ నుంచి గర్వించదగ్గ న్యాయకోవిదులు వచ్చారు..
వారి వారసత్వాన్ని న్యాయవాదులు కొనసాగించాలి
సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి పిలుపు
సాక్షి, హైదరాబాద్: ఈ తెలంగాణ గడ్డ నుంచి దేశం గర్వపడేలా ఎందరో న్యాయకోవిదులు వచ్చారని, వారి వారసత్వాన్ని కొనసాగించాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి పిలుపునిచ్చారు. తనకు 30 ఏళ్లకుపైగా ఈ కోర్టుతో అనుబంధం ఉందన్నారు. అంకితభావంతో పనిచేస్తే న్యాయవాదులు ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు.
ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్(హెచ్సీఏఏ) శుక్రవారం ఆయన్ను ఘనంగా సన్మానించింది.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ భట్టి మాట్లాడుతూ తన అన్న న్యాయవాదిగా ఎన్రోల్ అయినప్పుడు తొలిసారి ఈ కోర్టుకు వచ్చానని, అప్పుడే న్యాయవాది కావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.
మొదటి కోర్టు హాల్లో ఎక్కువగా ఉండటంతో లభించిన గుర్తింపు కూడా హైకోర్టు జడ్జి కావడానికి దోహదపడిందన్నారు. కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, పలువురు న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, పీపీ రాజేందర్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వర్రావు, ఉపాధ్యక్షుడు కల్యాణ్రావు, ప్రదీప్, దేవేందర్, నాగులూరి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు