
పాదరక్షలు దొరక్క రోగుల సహాయకుల తిప్పలు
జగిత్యాల ఎంసీహెచ్లో స్ట్రెచర్పై తీసుకొచ్చి బయట కుప్పగా పోస్తున్న సిబ్బంది
తరచూ వివాదాస్పదంగా మారుతున్న సిబ్బంది తీరు
జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మాతా శిశు ఆస్పత్రి నిర్వహణ విమర్శల పాలవుతోంది. చిన్నారుల తారుమారు, బెడ్స్ కేటాయించకుండా రోగులను నేలపై పడుకో బెట్టడం, ఓ రోగిని ఆస్పత్రి నుంచి బయటకు పంపడం, ఆస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేటుకు తరలించడం లాంటి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాతా శిశు ఆస్పత్రి సిబ్బంది.. రోగులను తరలించే స్ట్రెచర్పై చెప్పులు తరలిస్తూ మరో వివాదంలో చిక్కుకున్నారు. జగిత్యాల మాతాశిశు ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు చెప్పులు విప్పేందుకు సరైన షూ ర్యాక్స్, సెల్ఫులు, సరైన స్థలం కేటాయించలేదు.
దీంతో రోగులు, వారి సహాయకులు, బంధువులు తమకు తోచిన చోట పాదరక్షలు విడిచి లోనికి వెళ్తున్నారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది వారి చెప్పులను స్ట్రెచర్పై తరలించి ఆస్పత్రి ఆవరణలో కుప్పలుగా పోస్తున్నారు. రోగులను పరామర్శించి వచ్చేసరికి చెప్పులు కనబడక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నారు. ఆస్పత్రి ఆవరణలో పోసిన చెప్పులను కుక్కలు కొరికేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కాగా, రోగులను తరలించేందుకు వినియోగించే స్ట్రెచర్ను చెప్పులు తరలించేందుకు వినియోగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.