బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–2లో నివసించే మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్కు అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామని సిగ్నా ఎల్ఎల్సీ సంస్థతో పాటు అలీ బాఖురి, శ్రీతి కర్మాకర్, హుస్సేన్ బాఖురి, తరుణ్ వీసా ప్రాసెసింగ్ కోసం రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.3.95 లక్షలు వసూలు చేశారు. నకిలీ ఉపాధి పత్రాలను ఇచ్చారు. ఆమె అమెరికా వెళ్లగా.. అధికారులు పత్రాలను పరిశీలించగా నకిలీవని తేలింది.
ఆమె వీసాను రద్దు చేసి ఐదేళ్ల పాటు అమెరికా రాకుండా నిషేధం విధిస్తూ తిప్పి పంపారు. బాధితురాలు నగరానికి వచ్చాక నిందితులను నిలదీయగా సెటిల్మెంట్ పత్రంపై సంతకం చేయించుకుని రూ.4 లక్షలు చెల్లించారు. ఈ మోసం కారణంగా ఉద్యోగం పోవడంతో పాటు ఖర్చులు, ఇతర రూపాల్లో మొత్తం రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లింది. మిగిలిన నష్టపరిహారాన్ని చెల్లించకపోవడంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


