ఆస్తిపై కన్నేసి.. ప్రేమను కాదన్నాడని కక్ష పెంచుకుని.. ! | Sensational Details Out From Realtor Kuppala Madhu Incident | Sakshi
Sakshi News home page

ఆస్తిపై కన్నేసి.. ప్రేమను కాదన్నాడని కక్ష పెంచుకుని.. !

May 28 2024 11:29 AM | Updated on May 28 2024 12:50 PM

Sensational Details Out From Realtor Kuppala Madhu Incident

చిన్నకూతురిని ప్రేమ ముగ్గులో దించి ఆస్తిపై కన్నేసి.. పెళ్లికి నిరాకరించడంతోనే..

హైదరాబాద్‌, సాక్షి: రియల్టర్‌ మధు(48) హత్య కేసు సంచలనంగా మారింది. నగరానికి చెందిన బిల్డర్‌.. ఎక్కడో బీదర్‌లో హత్యకు గురికావడంతో కేసు పోలీసులకు సవాల్‌గా మారొచ్చని అంతా భావించారు.  అయితే.. మధుతో స్నేహం ఉన్నవాళ్లే ఈ హత్య చేసి ఉంటారన్న పోలీసులు అనుమానాలే నిజం అవుతున్నాయి. ఈ క్రమంలోనే విస్తుపోయే కోణం వెలుగు చూసింది.

బిల్డర్‌ కుప్పాల మధుకు భార్యా, ఇద్దరు పిల్లలు. జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉంటోంది మధు కుటుంబం. మధు రియల్‌ ఎస్టేట్‌తో పాటు ట్రావెల్స్‌ నిర్వహిస్తుంటారు. అలా మధు కోట్ల ఆస్తిని కూడబెట్టాడు. ఈ క్రమంలో రేణుకా ప్రసాద్‌తో మధుకి పరిచయం పెరిగింది. రేణుకా‌ గ్యాంగ్‌తో కలిసి మధు తరచూ కాసినో ఆటకు వెళ్తుంటారు. 

మధుకు నవరాత్రుల పూజలు ఘనంగా నిర్వహించే అలవాటు ఉంది. కిందటి ఏడాది.. నవరాత్రుల టైంలో పూజలకు వెళ్లిన రేణుకా.. మధు చిన్నకూతురిపై కన్నేశాడు. ఆమెను సొంతం చేసుకుంటే.. మధు  ఆస్తి కూడా దక్కుతుందని ప్లాన్‌ వేశారు. అలా.. ఆమెతో పరిచయం పెంచుకుని ప్రేమలోకి దించాడు. ఒకరోజు చిన్నకూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని మధును కోరాడు రేణుక. అయితే మధు అందుకు నిరాకరించాడు. అప్పటినుంచి రేణుక మధుపై కోపంతో రగిలిపోయాడు. దీనికితోడు ఈమధ్యే చిన్నకూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు మధు. దీంతో కక్ష పెంచుకున్న రేణుక.. మధును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు.

ముందుగా హైదరాబాద్‌లోనే మధును హత్య చేయాలని రేణుకా ప్రసాద్‌ ప్లాన్‌ వేశాడు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను నెలరోజులు హైదరాబాద్‌లో ఉంచాడు. అయితే.. హైదరాబాద్‌లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. క్యాసినో ఆడుదామని బీదర్‌కు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.

24న తేదీ..
మధు వ్యాపారం నిమిత్తం తరచూ బీదర్‌కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పేవాడు. ఈ క్రమంలోనే ఈనెల 24న బీదర్‌ వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. డ్రైవింగ్‌ కోసం తనతో పాటు చింతల్‌ ప్రాంతానికి చెందిన రేణుక ప్రసాద్‌(32), అతని స్నేహితులు వరుణ్, లిఖిత్‌ సిద్దార్థరెడ్డిని తీసుకెళ్లారు. రాత్రి 10 గంటలకు భార్య ఫోన్‌ చేయగా హైదరాబాద్‌ వస్తున్నట్లు మధు చెప్పారు. గంట తర్వాత మధుకు భార్య మళ్లీ ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. తెల్లవారినా మధు రాలేదు. బీదర్‌ జిల్లాలోని మన్నేకెళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 25వ తేదీ ఉదయం రోడ్డు పక్కన నిలిపిన కారు వద్ద  మృతదేహం కనిపించింది.  కారు నంబరు ఆధారంగా మృతుడు మధు అని గుర్తించి.. 25వ తేదీన జీడిమెట్ల పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

అయితే.. 
హైదరాబాద్‌లో మధును హత్య చేయడం వీలుకాదని భావించిన రేణుక.. కాసినో కోసం బీదర్‌ వెళ్దామని చెప్పి మధును తీసుకెళ్లాడు. అక్కడ మధును దారుణంగా హత్య చేశారు. మన్నేకెళ్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మధును పెద్ద బండరాయితో తలపై కొట్టి.. ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపినట్లు వెల్లడించారు. మధు ఒంటిపై ఉన్న రూ.6 లక్షల విలువైన బంగారం, ఆయన వద్ద ఉన్న పెద్ద మొత్తంలో నగదు సైతం ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల్ని విచారిస్తున్న పోలీసులు.. మీడియా సమావేశం ద్వారా వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement