శాస్త్రవేత్త హరికాంత్‌కు పురస్కారం

Sangareddy Research Center Scientist Porika Harikanth Received National Award - Sakshi

ఉద్యాన పరిశోధనలకు జాతీయస్థాయి గుర్తింపు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలోని మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త పోరిక హరికాంత్‌ జాతీయస్థాయి పురస్కారం అందుకున్నారు. ఉద్యాన పంటలపై చేసిన పరిశోధనలకు ఆయన ఫెలో ఆఫ్‌ కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీహెచ్‌ఏఐ)–2022 పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ (ఐసీఏఆర్‌) డిప్యూటీ డైరెక్టర్‌ హెచ్‌.పి.సింగ్‌ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు.

ములుగు జిల్లా అన్నపల్లి గ్రామానికి చెందిన హరికాంత్‌ ప్రస్తుతం సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈయన ఇజ్రాయిల్‌ మీషావ్‌ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా. ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్‌ దేశాల్లో ఉద్యాన పంటలపై పరిశోధనలు చేశారు.

2018లో ఆయన యువ శాస్త్రవేత్త పురస్కారాన్ని ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ నుంచి అందుకున్నారు. కేవలం ఆస్ట్రేలియా వంటి దేశాలకే పరిమితమైన రెడ్‌గ్లోబ్‌ అనే ద్రాక్ష రకాన్ని భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేసినందుకు హరికాంత్‌కు గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top