విద్యార్థి గొంతు నులుముతున్న పోలీసు
కలెక్టరేట్ ముట్టడిని అడ్డుకునే క్రమంలో విద్యార్థుల గొంతు పట్టుకున్న పోలీసులు
మహబూబాబాద్: విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులను అడ్డుకునే క్రమంలో పోలీసులు ఇద్దరు విద్యార్థుల గొంతు పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాలిటెక్నిక్ కళాశాలలను ‘శక్తి స్కీం’లో విలీనం చేసే అంశాన్ని వెన క్కి తీసుకోవాలని, జీఓ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం మహబూబాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. విద్యార్థి నాయకులు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 97ద్వారా డిప్లామా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం వల్ల పాలిటెక్నిక్ డిప్లామా విద్యకు ఉన్న ప్రత్యేకత, ప్రాధాన్యత తగ్గుతుందన్నారు. కాగా, విద్యార్థులను అడ్డుకునే క్రమంలో ఇద్దరు విద్యార్థుల గొంతును సీఐతోపాటు పోలీసులు పట్టుకోవడం, ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. ఈ కార్యక్రమంలో డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయికుమార్, కోశాధికారి గుగులోత్ సూర్యప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు రోడ్డెక్కితే గొంతు పిసికి చంపేస్తారా : హరీశ్రావు
‘విద్యార్థులు రోడ్డెక్కితే గొంతు పిసికి చంపేస్తారా అని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ఇదేనా మీరు పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు అంటూ బుధవారం ఒక ప్రకటనలో నిలదీశారు. విద్యార్థులపై ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా, ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే లాఠీలు.. హక్కుల కోసం రోడ్డెక్కితే అణచివేతలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


