
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నివాసం ఉంటున్న పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఉంటున్న నలుగురు పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు అందజేశారు. రేపటిలోగా హైదరాబాద్ను విడిచి వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
వివరాల ప్రకారం.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లలో కలిపి 213 మంది పాకిస్తానీలు నివాసం ఉంటున్నారు. వీరిలో నలుగురు షార్ట్ టర్మ్ వీసా మినహాయిస్తే మిగతా అందరికీ లాంగ్ టర్మ్ వీసాలు (LTV) ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సదరు నలుగురు వ్యక్తులు రేపటి లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తానీయులు వీసా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ కు చెందిన వారు వెంటనే తమ రాష్ట్రాలను వీడి స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ డీజీపీ జితేందర్.. రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే స్వదేశీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంది. పాకిస్తానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుండి వెళ్లొచ్చు. ఈనెల 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలి. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.
కాగా, భారత్లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది.