ఆస్తి కోసం కొడుకు కుట్ర‌.. బుద్ధి చెప్పిన క‌లెక్ట‌ర్‌! | Nalgonda Collector Acts Against Son In Property Harassment Case, Restores Home To Ailing Parents | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం కొడుకు కుట్ర‌.. బుద్ధి చెప్పిన క‌లెక్ట‌ర్‌!

Jun 15 2026 1:54 PM | Updated on Jun 15 2026 3:43 PM

Nalgonda Collector Evicts Son Restores Home To Ailing Parents

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఓ వృద్ధ దంపతులు తమ సొంత ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఏళ్ల తరబడి పోరాడాల్సి వచ్చింది. న్యాయపోరాటాలు, వేధింపులు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న 71 ఏళ్ల ఎంజం రమణారెడ్డి, ఆయన భార్య 66 ఏళ్ల చంద్రకళకు చివరకు న్యాయం జరిగింది. నల్గొండ కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ ‘తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంక్షేమ చట్టం–2007’ కింద ప్రత్యేక అధికారాలను వినియోగించి వారి చిన్న కుమారుడిని ఇంటి నుంచి ఖాళీ చేయించాలని ఆదేశించారు.

మిర్యాలగూడ హౌసింగ్‌బోర్డు కాలనీలో నివసించే రమణారెడ్డి, చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికాలో స్థిరపడగా, కుమార్తెకు వివాహమైంది. ఉద్యోగం లేని చిన్న కుమారుడు దయాకర్‌రెడ్డికి దాదాపు నాలుగు ఎకరాల భూమిని ఇచ్చినట్లు దంపతులు తెలిపారు. అంతేకాకుండా అతని భార్య, కుమార్తెలు జీవనోపాధి పొందేందుకు నేరేడుచర్ల మండలం ఎంజంవారిగూడెంలోని తమ ఇంట్లో ఉండే అవకాశం కూడా కల్పించారు. 

తమ జీవిత పొదుపులతో రమణారెడ్డి దంపతులు మిర్యాలగూడ హౌసింగ్‌బోర్డు కాలనీలో ఓ ఇల్లు నిర్మించడంతో పాటు పక్కనే మూడు గుంటల స్థలాన్ని కొనుగోలు చేశారు. పిల్లల చదువుల కోసం అంటూ దయాకర్‌రెడ్డి తన కుటుంబంతో ఆ ఇంట్లోకి వచ్చి నివసించడం ప్రారంభించాడు. అయితే 2022 అక్టోబర్‌లో దయాకర్‌రెడ్డి నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు సృష్టించి, ఆ ఇంటిని తన భార్యకు విక్రయించినట్లు చూపించాడని దంపతులు ఆరోపించారు. ఆరోగ్య సమస్యల కారణంగా తాము మిర్యాలగూడ ఇంటికి వెళ్లాలని ప్రయత్నించగా, తమను ఇంటి నుంచి బలవంతంగా వెళ్లగొట్టినట్లు తెలిపారు. స్థానికులు కూడా న్యాయపరమైన ఇబ్బందుల భయంతో తమకు అండగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు తిరిగి గ్రామంలోని పాత ఇంటికి వెళ్లాల్సి వచ్చింది.

చంద్రకళ మాట్లాడుతూ.. తమ కుమారుడు రైతుబంధు సాయం కూడా నిలిపివేశాడని, గ్రామస్తులు తమ భూములను కౌలుకు తీసుకోకుండా బెదిరించాడని ఆరోపించారు. దీంతో తమకు ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయని చెప్పారు. అంతేకాకుండా కట్న వేధింపులు, భూవివాదాలు వంటి తప్పుడు ఆరోపణలతో వివిధ కోర్టుల్లో తమపై 22 కేసులు పెట్టాడని, వాటి విచారణల కోసం తరచూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని వృద్ధ దంపతులు వాపోయారు. ఈ పరిణామాలతో తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు.

వృద్ధ దంపతుల ఫిర్యాదులపై అధికారులు విచారణ చేపట్టి, ‘తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంక్షేమ చట్టం–2007’ ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దయాకర్‌రెడ్డిపై కేసు నమోదు కాగా, తాజాగా కలెక్టర్‌ ఆదేశాలతో వృద్ధ దంపతులు తమ ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. రమణారెడ్డి ఇటీవల పక్షవాతానికి గురికావడంతో తరచూ వైద్య చికిత్స అవసరమవుతోంది. పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, వృద్ధాప్య సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యల చికిత్స కోసం ప్రతి నెలా దాదాపు రూ.15 వేల వరకు మందులు, వైద్య పరీక్షలకే ఖర్చవుతోందని చంద్రకళ తెలిపారు.

ప్రస్తుతం ఈ వృద్ధ దంపతులు తమ కుమార్తె, అమెరికాలో స్థిరపడిన పెద్ద కుమారుడు పంపుతున్న ఆర్థిక సహాయంతో జీవనం సాగిస్తున్నారు. 2022 జూన్‌లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన పెద్ద కుమారుడు తల్లిదండ్రులను చూసేందుకు మళ్లీ రావాలనుకుంటున్నప్పటికీ, తమ్ముడు సృష్టించిన న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంటాననే భయంతో వెనుకడుగు వేస్తున్నాడని చంద్రకళ పేర్కొన్నారు. తమ మిగిలిన ఆస్తులను కూడా తమ పేర్ల నుంచి బదిలీ చేయించుకునేందుకు దయాకర్‌రెడ్డి గతంలో కొంతమంది రౌడీలను పంపించి ఒత్తిడి తెచ్చాడని, పొలంలో పని చేస్తున్న సమయంలో తమపై భౌతిక దాడికి కూడా పాల్పడ్డాడని వృద్ధ దంపతులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఆరోగ్యం క్షీణించడం, నివసించేందుకు భద్రమైన స్థలం లేకపోవడంతో వృద్ధ దంపతులు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని, మిర్యాలగూడలోని ఇంటిని తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ దయాకర్‌రెడ్డిని ఆ ఇంటి నుంచి ఖాళీ చేయించాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ సీనియర్‌ సిటిజన్స్‌ విభాగానికి చెందిన ఎం. నాగిరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ, పోలీసు అధికారుల సమక్షంలో మిర్యాలగూడలోని ఇంటిని అధికారికంగా వృద్ధ దంపతులకు అప్పగించినట్లు తెలిపారు.

“మేము కష్టపడి సంపాదించిన ఇళ్లు, భూములను సమాధి వరకు తీసుకెళ్లం. చివరకు అవన్నీ పిల్లలకే చెందుతాయి. అయినప్పటికీ ఆస్తి కోసం మా చిన్న కుమారుడు మమ్మల్ని ఇంత దారుణంగా ఎందుకు వేధించాడో అర్థం కావడం లేదు” అని రమణారెడ్డి, చంద్రకళ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మిర్యాలగూడ ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నప్పటికీ, గ్రామంలోని తమ ఆస్తిపై కూడా దయాకర్‌రెడ్డి కన్నేశాడనే భయం వారిలో ఇంకా ఉంది. గ్రామంలోని ఇంటి తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకుంటానని అతడు బెదిరించినట్లు వారు ఆరోపించారు.

ఈ విషయాన్ని నల్గొండ కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో మరోసారి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాలని వృద్ధ దంపతులు నిర్ణయించుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement