
హైదరాబాద్ దారుస్సలాంలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న అసదుద్దీన్ ఒవైసీ
దారుస్సలాం బహిరంగ సభలో మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించే దాకా పోరాటం ఆగదని స్పష్టికరణ
రైతు చట్టాల రద్దుకు అన్నదాతలు అనుసరించిన బాటను అనుసరిస్తామని వెల్లడి
జూన్ 1 వరకు నిరసనల కార్యాచరణ ప్రకటించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం పేరుతో ఓ నల్ల చట్టాన్ని తీసుకొచ్చారని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆ చట్టాన్ని మోదీ సర్కారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకొనేలా దేశవ్యాప్తంగా అన్నదాతలు పోరాడిన స్ఫూర్తితో నల్ల చట్టాన్ని ఉవసంహరించే వరకు దేశవ్యాప్తంగా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.
శనివారం రాత్రి హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖలీద్ సైఫుల్లా రెహా్మనీ అధ్యక్షతన జరిగిన సభలో డీఎంకే ఎంపీ మహ్మద్ అబ్దుల్లా, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ హఫీజ్ ఖాన్, బీఆర్ఎస్ మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుడు సయ్యద్ నిసార్ హుస్సేన్ హైదర్ ఆఘా, మౌలానా మతీనుద్దీన్ ఖాద్రీ, మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
11 ఏళ్లుగా ముస్లింలపై అణచివేత..
ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రూపొందించే సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మతపరమైన విధానాలు, సంప్రదాయాలను స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. అయితే అంబేడ్కర్ కంటే తనను తాను గొప్పగా భావిస్తున్న ప్రధాని మోదీ ముస్లింలకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కానీ వాస్తవానికి అంబేడ్కర్ కాలి ధూళికి కూడా మోదీ సరిపోరని వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోదీ 11 ఏళ్లుగా దేశాభివృద్ధిని మరిచి ముస్లింలను అణచివేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఒవైసీ ఆరోపించారు.
వక్ఫ్ సవరణ చట్టంతో మసీదులు, ఆస్తులను కాజేయడానికి ప్రయతిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో 500కుపైగా వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వపరం చేశారని మండిపడ్డారు. గతంలోనే బోహ్రా వర్గం వక్ఫ్ బిల్లు నుంచి మినహాయించాలని కోరిందని.. కానీ సవరణ చట్టంపై బోహ్రా వర్గం సంతృప్తిగా ఉన్నట్లు మోదీ ఫొటోలకు పోజులిస్తున్నారని ఆయన విమర్శించారు. ముస్లింలను విభజించడం ద్వారా బలహీనపరిచేందుకు మోదీ చేస్తున్న కుటిలయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ముస్లింల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికే నల్ల చట్టాలను తీసుకొచ్చారని ఆరోపించిన ఒవైసీ.. ఈ విషయంలో కోర్టులు తమకు న్యాయం చేస్తాయనే విశ్వాసం ఉందన్నారు.
నిరసనల కోసం కార్యాచరణ
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 30న రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో 10 నిమిషాలు లైట్లు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపాలని కోరింది. అలాగే మే 18న రౌండ్ టేబుల్ సమావేశాలు, మే 22న హైదరాబాద్ మాసాబ్ట్యాంక్లో మహిళల బహిరంగ సభ, మే 25న అన్ని జిల్లాల్లో మానవహారం, జూన్ 1న అన్ని జిల్లాల్లో ధర్నాలు, హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించింది.