హైదరాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ కల నెరవేర్చే క్రమంలో వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు అత్యంత సమీపంలోనే క్యూర్ పరిధిలో పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పేదల ఉపాధి, పిల్లల చదువు, కుటుంబ జీవన వ్యవస్థ దెబ్బతినకుండా నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని వారు నివశిస్తున్న ప్రాంతాలలోనే వారికి గౌరవప్రదమైన నివాసం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గారు స్పష్టం చేశారు.
గురువారం సచివాలయంలోని తన కార్యలయంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల శాశ్వత భవనాల నిర్మాణం, భద్రాచలం దేవస్థానం అభివృద్ధి అంశాలపై అధికారులతో మంత్రి గారు సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది క్యూర్ పరిధిలో లక్ష ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రయోగాత్మకంగా తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. క్యూర్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో ఇప్పటికే దాదాపు 20 వరకు స్థలాలను గుర్తించామని, మిగిలిన ప్రాంతాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి ఈ నెల 28వ తేదీ లోగా అన్ని లొకేషన్లను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రతి స్థలానికి సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లు, నిర్మాణ నమూనాలను కూడా జూన్ 28లోగా సిద్ధం చేయాలని, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన విధివిధానాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలతో కూడిన బ్రోచర్ను జూలై మొదటి వారంలో విడుదల చేస్తామని వెల్లడించారు. క్యూర్ పరిధిలో అత్యంత ముఖ్యమైన్ ప్రాంతాలల్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్లో ఇండ్ల నిర్మాణాలను చేపడుతున్నామని ఈ స్థలాల్లో అన్ డివైడెడ్ షేర్ క్రింద మహిళలకు వాటా కల్పిస్తూ ఆ భాగాన్ని మహిళల రిజిస్ట్రేషన్ చేస్తామని మరోమారు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకే మోడల్ లో ఆర్.డి.ఓ., తహశీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు.ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకొని వీలైనంత త్వరితగతిన పనులు ప్రారంభించేలా ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని ఆదేశించారు. అలాగే, ఆర్.డి.ఓ. తహశీల్దార్ కార్యాలయాల భవనాల మరమ్మతులకు సంబంధించి హౌసింగ్ ఏ.ఈ. లు భవనాలను విజిట్ చేసి ప్రతిపధనలు పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి, డి.ఎస్. లోకేశ్ కుమార్, హౌసింగ్ శాఖ కార్యదర్శి వి.పి. గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.


