- జర్మనీ విశ్వవిద్యాలయంలో చదివేందుకు 10లక్షల ఆర్ధిక సాయం అందజేత
హైదరాబాద్: నిరుపేద విద్యార్థిని కలలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అండగా నిలిచారు. దేవరకొండకు చెందిన ఓ నిరుపేద రోజువారీ కూలీల కుటుంబానికి చెందిన విద్యార్థిని పరిమళకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా నిలవలేదు. ఐఐటీ మద్రాస్లో ఉన్నత విద్యను పూర్తి చేసిన ఆమె, జర్మనీలో మాస్టర్స్ చదివేందుకు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో సీటు సాధించింది. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె కలలు నెరవేరుతాయా లేదా అనే సందిగ్ధ పరిస్థితి నెలకొంది.
ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ దృష్టికి రావడంతో, ఆయన ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులను పిలిపించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ విషయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వారిని మంత్రి గారిని కలిసేలా ఏర్పాట్లు చేశారు.
విద్యార్థిని సాధించిన విజయాన్ని, ఆమె ఉన్నత చదువుల పట్ల ఉన్న అంకితభావాన్ని తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆపద్బాంధవుడిలా స్పందించారు. పేదరికం కారణంగా ప్రతిభ మరుగున పడకూడదనే ఉద్దేశంతో 'కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్' ద్వారా వెంటనే రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి, ఆమె విదేశీ ఉన్నత విద్యకు అండగా నిలిచారు.


