సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. ఇది హాట్ చర్చకు దారి తీసింది.
ప్రీతిరెడ్డి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు గుప్పించారు. బీజేపీ పార్టీ విధానాలపై సానుకూలంగా మాట్లాడారు. దీంతో ఆమె బీజేపీ వైపు అడుగేస్తారనే చర్చ మొదలైంది. ఈ ఊహాగానాల నడుమ శుక్రవారంనాడు ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీ ఆఫీస్కు వెళ్లి.. సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. అయితే..
ఇది మర్యాదపూర్వక భేటీనేనని చెబుతూ ప్రచారాలకు ప్రీతిరెడ్డి తెర దించారు. ‘‘మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఐ క్యాంపస్ ఓపెనింగ్కు ప్రధాని మోదీని ఆహ్వానించాం. మోదీని ఆహ్వానించాం కాబట్టే ఆ పార్టీ నేతలను ఇప్పుడు కలుస్తున్నాం. బీజేపీనే కాదు.. అన్ని పార్టీల నేతలను కలిసి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం కోసం మొన్న మంత్రి శ్రీధర్బాబును కూడా కలిశాం. నేను బీజేపీలో చేరడం లేదు. మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాకు బీఆర్ఎస్ అంటే గౌరవం ఉంది. విద్యావేత్తగా అందరితో కలిసి ఉండడంలో తప్పేముంది? దయచేసి ఈ ప్రచారానికి ఇంతటితో ఆపండి’’ అని అన్నారామె.
సాక్షితో చిట్చాట్లో..
- ఏఐ క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాం
- బీజేపీ నేతలను కలిసి ఇదే విషయం తెలియజేశాం
- బీఆర్ఎస్ నేతలను, కాంగ్రెస్ వాళ్లనూ ఆహ్వానిస్తాం
- అన్ని పార్టీల నేతలను కలుస్తాం
- ఇప్పుడ రాజకీయాల్లోకి రావాలని లేదు
- మహిళా రిజర్వేషన్లు వచ్చి ఉంటే బాగుండేది
మల్లారెడ్డి ఇటీవల కుటుంబంతో సహా ప్రధాని మోదీని కలిశారు. దీంతో ఆయన కూడా బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా నడిచింది. అయితే ఆ కథనాలపై ఆయన స్పందించారు. మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీలో దేశంలోనే మొట్టమొదటి డీజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ను గూగుల్తో కలిసి త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇది ఆసియాలోనే అతిపెద్దదైన ఏఐ-ఏజెన్సీ క్యాంపస్ కానుంది. అందుకే ప్రధాని నరేంద్రమోదీని ఆ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు మల్లారెడ్డి మీడియాకు వివరణ ఇచ్చారు.



