తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదు | KTR comments on revanth reddy about budget | Sakshi
Sakshi News home page

తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదు

Feb 2 2025 5:01 AM | Updated on Feb 2 2025 5:01 AM

KTR comments on revanth reddy about budget

కేంద్ర బడ్జెట్‌ నుంచి తెలంగాణకు చిల్లిగవ్వ కూడా తీసుకురాలేకపోయిన సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు, రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలి. జాతీయ పార్టీలు ఎప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్‌తో రుజువైంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే, 16 మంది ఎంపీలు తెలంగాణకు తెచ్చింది అక్షరాలా గుండుసున్నా. సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరీ చేస్తున్న బడేభాయ్‌– చోటేభాయ్‌ అనుబంధంతో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయింది. 

తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడే బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం లేకుంటే జరిగే నష్టం ఏమిటో ప్రజల గమనిస్తున్నారు. పార్లమెంట్‌లో ప్రాంతీయ పార్టీలకు బలమున్న బిహార్, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం చూసిం జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్థమైంది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరోసారి పార్లమెంట్‌ సాక్షిగా ఈ బడ్జెట్‌ రుజువు చేసింది.

దేశఖజానా నింపే దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. సీఎం రేవంత్‌ 30 మార్లు ఢిల్లీకి వెళ్లింది నిధుల కోసం కాదని, ఢిల్లీకి మూటలు మోసేందుకు వెళ్లారని బడ్జెట్‌ ప్రతిపాదనలతో తేటతెల్లమైంది. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచి, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు నయాపైసా తీసుకురాలేకపోయారు.  – బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  

 

Advertisement
 
Advertisement
Advertisement