సాక్షి,జగిత్యాల: మీరు చావాలనుకుంటే నేను చావను. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తానని’ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సభలో కేసీఆర్ మాట్లాడారు.
పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని కోరుకుంటుంటున్నారు. పిల్లి శాపానికి ఉట్టి తెగదు మీరు చావాలనుకుంటే నేను చావను. మీరు వెయ్యి జన్మలెత్తినా నేను చావను. చివరి శ్వాస వరకు తెలంగాణకు సేవ చేస్తా. వడ్డించిన విస్తరిలా మీకు తెలంగాణను అప్పగించాం. అన్నీ రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్గా నిలిపి మీకిచ్చాం. మా హయాంలో తెలంగాణ ఎలా ఉంది. మీ హయాంలో తెలంగాణ ఎలా ఉంది అని ప్రశ్నించారు.
ఇప్పుడు అవినీతి, స్కాం, భూకబ్జాలు తప్ప అభివృద్ధి లేదు. సివిల్ సప్లై, సింగరేణిలో దోచుకుంటున్నారు. ఏ రైతును పలకరించినా తప్పు జరిగిందని బాధపడుతున్నారు. రాష్ట్రమంతా ఖాళీ, అంతా దోచుకున్నారు. హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్లో నిడ్రా, జగిత్యాలలో జిడ్రానా, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడడ్రాను తొలగిస్తాం. మొదటి సంతకంతోనే హైడ్రాను తొలగిస్తాం. పేదల ఇండ్లు కూలగొట్టడం ఏంటి? ఇది మూసీ సుందరీకరణ కోసం కాదు,రియల్ ఎస్టేట్ కోసం. ప్రజల కోసం ఒక్క స్కీం తీసుకురాలేదు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను తీసేస్తాం’ అని వ్యాఖ్యానించారు.


