ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లారు.. విమానంలో వచ్చి కొనేశారు! | Infant Kidnapping Incident In Chandanagar Hyderabad | Sakshi
Sakshi News home page

ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లారు.. విమానంలో వచ్చి కొనేశారు!

Jul 4 2026 7:59 AM | Updated on Jul 4 2026 7:59 AM

Infant Kidnapping Incident In Chandanagar Hyderabad

చందానగర్‌లో పసికందు కిడ్నాప్‌ కథ సుఖాంతం

బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తున్న సీపీ రమేష్‌

సాక్షి, హైదరాబాద్‌: చందానగర్‌ ఠాణా పరిధిలో జూన్‌ 30న ఓ చిన్నారిని తల్లి పొత్తిళ్ల నుంచి ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర ముఠాను 72 గంటల్లోనే పోలీసులు అరెస్టు చేశారు. పసికందును క్షేమంగా తల్లి ఒడికి చేర్చారు. సైబరాబాద్‌ కమిషనర్‌ డాక్టర్‌ రమేష్‌ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బీదర్‌కు చెందిన మాలన్‌ బౌరవ్‌ శాంతా బాయి కుటుంబం హైదరాబాద్‌కు వలస వచ్చి సర్కస్‌లోపనిచేస్తూ జీవనం సాగిస్తోంది. గత నెల 30న తెల్లవారుజామున లింగంపల్లి రైల్వే స్టేషన్‌ ప్రహరీ పక్కన ఫుట్‌పాత్‌పై శాంతాబాయి తన నెలరోజుల పాపతో నిద్రపోతుండగా తెల్లవారుజామున 2 గంటలకు వికారాబాద్‌కు చెందిన మహ్మద్‌ జుబేర్, ఇర్ఫాన్‌లు ఆటోలో వచ్చి.. పసిపాపను లాక్కొని పారిపోయారు. బిడ్డ ఏడుపు విన్న తల్లి నిద్రలేచి ఆటో వెనుక పరిగెత్తినా దుండగులు వేగంగా వెళ్లిపోయారు.

అమ్మతనం కోసం బేరం.. 
కోల్‌కతాకు చెందిన రెహనుమా అలీ అనే మహిళకు పెళ్లయి ఐదేళ్లయినా సంతానం కలగలేదు. దీంతో ఆమె.. బంజారాహిల్స్‌లో ఉంటున్న తన పిన్ని నిమ్మీ జహానీ అలియాస్‌ సీమాను సంప్రదించింది. డబ్బులిస్తాను ఒక పసిబిడ్డను దత్తత ఇప్పించాలని కోరింది. సీమా తన స్నేహితురాలైన నేరెడ్‌మెట్‌కు చెందిన నాజియాకు విషయం చెప్పింది. నాజియా తనకు కాబోయే భర్త జుబేర్‌కు భారీగా డబ్బు వస్తుందని ఆశ చూపించింది. దీంతో అతను ఆటో డ్రైవర్‌ ఇర్ఫాన్‌తో కలిసి కిడ్నాప్‌ ప్లాన్‌కు స్కెచ్‌ వేశాడు.

విమానంలో వచ్చి.. కిడ్నాపర్లు పసికందును ఎత్తుకెళ్లిన తరువాత పాపను నేరుగా నాజియా ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజే (జూలై 1) రెహనుమా తన పిన్ని సర్వరితో కలిసి కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు విమానంలో వచ్చింది. డీల్‌ ప్రకారం.. పాపను అప్పగించినందుకు రెహనుమా.. జుబేర్‌కు రూ.1.50 లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేసింది. ఈ కేసులో మూడు రోజుల పాటు పోలీసులు వందలాది సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. సాంకేతిక ఆధారాల సాయంతో కిడ్నాపర్లు కోల్‌కతాకు పారిపోయే లోపే సఫిల్‌గూడ చంద్రపురి కాలనీలో చుట్టుముట్టి జుబేర్, ఇర్ఫాన్, నాజియా, సీమా అలీ, రెహనుమా అలీలను అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ రమేష్‌ చేతుల మీదుగా ఆ  పసికందును తిరిగి కన్నతల్లి ఒడికి చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement