మా ఆదేశాలు అమలు చేయడం లేదు : హైకోర్టు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ ఒక్కటి అమలు చేయలేదని హైకోర్టు సీరియస్ అయ్యింది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆసుపత్రులు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను పీడిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన సీఎస్ సోమేశ్ కుమార్..కరోనాకు సంబంధించిన అఫిడవిట్ను కోర్టుకు సమర్పించారు. హైకోర్టు ఆదేశాలు అమలు చేశారా లేదా అని ప్రశ్నించగా..కరోనా పరీక్షలు ఎక్కువగా చేస్తున్నామని సీఎస్ బదులిచ్చారు. ఇప్పటికే 50 ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని పేర్కొనగా..మరి మిగిలిన హాస్పిటల్స్ పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. అపోలో, బసవతారకం వంటి హాస్పిటల్స్ పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తి వివరాలతో త్వరలోనే బులిటెన్ విడుదల చేస్తున్నామని సీఎస్ సోమేష్కుమార్ కోర్టుకు వివరించారు.
ఇక రాష్ర్టంలో 8వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ను తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. గత నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించడాన్ని సవాలు చేసిన ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీమ్ 2005 యాక్ట్ ప్రకారం పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ఇటీవలె తొలిగించారు. పెండిండ్లో ఉన్న జీతాలను తిరిగి చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోర్టుకు విన్నవించుకున్నారు. ఈ పిటిషన్పై హెకోర్టులో విచారణ కొనసాగుతుంది.