ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు.. | GHMC Strict Action Against Fake Birth Death Certificate Issue | Sakshi
Sakshi News home page

ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు.. బాధ్యులపై క్రిమినల్ కేసులు

Mar 8 2023 8:45 PM | Updated on Mar 8 2023 9:51 PM

GHMC Strict Action Against Fake Birth Death Certificate Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బర్త్, డెత్ ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారంపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు చేపట్టింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిధ్దమైంది. మొత్తం నలుగురు బల్దియా ఉద్యోగులపై బదిలీ వేటు వేసింది. హెల్త్ విభాగం సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్‌లను బదిలీ చేయాలని నిర్ణయించింది. స్టాటిస్టికల్ విభాగంలో ఏఎస్‌ఏ, డీఎస్‌ఓ లను సొంత డిపార్ట్ మెంట్‍లకు పంపించాలని నిర్ణయం తీసుకుంది.

కంప్యూటర్ ఆపరేటర్ల నియామకంలో అవకతవకలపై మేయర్  విజయలక్ష‍్మి సీరియస్ అయ్యారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. పూర్తి విచారణ జరిపి నివేదిక అందజేయాలన్నారు. ఇలాంటివి పునరాృతం కాకుండా చూడాలని కమిషనర్, మిగతా అధికారులకు ఆదేశాలు పంపారు.

ఏం జరిగిందంటే..?
ఆన్‌లైన్‌లో బర్త్ సర్టిఫికెట్ వచ్చేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించింది జీహెచ్ఎంసీ. అయితే  ఈ చర్య ద్వారా వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. బర్త్‌తో పాటు డెత్‌ సర్టిఫికెట్‌లను ఎడాపెడా జారీ చేశారు ఇంటిదొంగలు. అలాగే.. నాన్ అవైలబిలిటీ పేరుతో గత మార్చి నెల నుంచి డిసెంబర్ దాకా 31 వేల సర్టిఫికెట్లు జారీ చేశారు. ఆ నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగానే కొందరికి పాస్ పోర్టులు, వీసాలు కూడా మంజూరు అయ్యాయి. వాటి ఆధారంగానే మరికొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు .  

అంతేకాదు.. ఫేక్‌ డెత్ సర్టిఫికెట్లతో  బీమా బురిడీ జరిగిందని గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో కంప్యూటర్‌ ఆపరేటర్లేదే కీలక పాత్రగా నిర్ధారించుకున్న పోలీసులు.. అలాగే మీ సేవా సిబ్బందితో  కొందరు అధికారులు కుమ్మకై పత్రాలు జారీ చేసినట్లు గుర్తించారు.

పోలీసుల చర్యలతో బయటపడ్డ బాగోతం
గత డిసెంబర్‌లో మొఘల్ పురలోని మూడు మీసేవా సెంటర్లలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వందల కొద్దీ నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది ఈ అంశం. ఇక పోలీసుల చర్యలతో జీహెచ్ఎంసీ మేల్కొంది. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లలో ఈ తతంగం జరిగినట్లు గుర్తించి, 27 వేలకు పైగా నకిలీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. అంతేకాదు.. విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కూడా.
చదవండి: రసవత్తరంగా రాజకీయం.. కవిత లేఖకి ఈడీ రిప్లై!

Advertisement
 
Advertisement
Advertisement