రాజకీయాలకు కాదు..రైతుల కోసం వచ్చాం | Floods: Shivraj Singh Chouhan To Visit Affected Areas Of telangana | Sakshi
Sakshi News home page

రాజకీయాలకు కాదు..రైతుల కోసం వచ్చాం

Sep 7 2024 6:05 AM | Updated on Sep 7 2024 6:05 AM

Floods: Shivraj Singh Chouhan To Visit Affected Areas Of telangana

అన్నదాతకు సేవ చేస్తే భగవంతుడికి పూజ చేసినట్టే 

గత ప్రభుత్వం ఫసల్‌ బీమాను నిర్లక్ష్యం చేసింది

వరదతో నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం

కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌

కూసుమంచి: ‘భారీగా వరదలు వచ్చాయి.. రైతులు ఎంతో నష్ట పోయారు. ఈ నష్టాన్ని కళ్లారా చూశాను. రైతులను ఆదుకునేందుకే నేనూ, హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ మీ వద్దకు వచ్చామే తప్ప రాజకీయాల కోసం కాదు’ అని కేంద్ర వ్యవసా యశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు శుక్రవారం కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, బండి సంజయ్‌ ఖమ్మం జిల్లాకు వచ్చారు. ముందుగా ఖమ్మం నగరంలోని ముంపు ప్రాంతాలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించాక.. కూసుమంచి మండలానికి చేరుకున్నారు.

అక్కడ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి జాతీయరహదారి గుండా వెళుతూ పాలేరువాగు వద్ద దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పాలేరు వద్ద ఎడమకాల్వకు పడిన గండి, నర్సింహులగూడెం వద్ద దెబ్బతిన్న వరిని పరిశీలించి నష్టంపై ఆరా తీశారు. ఆ తర్వాత నవోదయ విద్యాలయంలో ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో వరద నష్టంపై ఆయా జిల్లాల అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

నేనూ రైతునే..
వరదలకు వరి, మిర్చి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు  ఏరియల్‌ సర్వే ద్వారా గమనించానని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. తాను రైతునేనని, రైతుల కష్టా లు తెలుసునని చెప్పారు. వందేళ్లలో ఇవే భారీ వర దలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పగా.. వాస్తవాన్ని చూసి చలించిపోయానన్నారు. ఒక్క పంటలే కాకుండా ఇళ్లు, వస్తువులు దెబ్బతినగా జంతు వులు మృత్యువాత పడ్డాయని, రైతులు ఈ వరదల్లో పంటలనే కాదు, వారి జీవనాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రైతులకు ఎలా మేలు చేయా లో నిర్ణయం తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం ఫసల్‌ బీమా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, అందుకే ఇప్పుడు రైతులు తీవ్రంగా నష్టపో వాల్సి వచ్చిందని మంత్రి చౌహాన్‌ తెలిపారు.

రైతు కన్నీరు.. ఓదార్చిన కేంద్ర మంత్రి
నవోదయ విద్యాలయంలో రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేయగా కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన రైతు హలావత్‌ వెంకన్న హిందీలో మాట్లాడారు. వరదలతో తాము సర్వస్వం కోల్పోయామని, ఆశలన్నీ గల్లంతయ్యాయని కన్నీరు పెడుతూ కేంద్రమంత్రి చౌహాన్‌ కాళ్లపై పడబోగా ఆయన రైతును పైకి లేపి ఓదార్చారు. ‘మీ బాధలు కళ్లారా చూశాను.. కంటనీరు రానివ్వం’ అని భరోసా కల్పించారు. పర్యటన అనంతరం నాయ కన్‌గూడెం టోల్‌ప్లాజా నుంచి కేంద్ర మంత్రులతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి, తుమ్మల ఒకే హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ బయలుదేరారు.

Advertisement
 
Advertisement
Advertisement