
ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా(కే) రైతులు రుణ మాఫీకోసం వినూత్న నిరసన చేపట్టారు. రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని సోమవారం రైతులు పట్టాదారు పాసుపుస్తకాలతో సెల్ఫీ దిగి సీఎం కార్యాలయానికి పంపించారు. తమకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, రైతు భరోసా అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖరా(కే)లో 190 మంది వరకు చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని, ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో 50 మంది రైతులకే రుణమాఫీ అయిందని, మిగతా 140 మంది అర్హులైనా రుణమాఫీ కాలేదని వాపోయారు.
రుణమాఫీకి అన్ని అర్హతలు ఉన్నా అమలు కాకపోవడంతో పొలం పనులు విడిచి రోజుల తరబడి బ్యాంకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోందని తెలిపారు. రైతు భరోసా ఇవ్వకపోవడంతో పెట్టుబడుల కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోందన్నారు.