సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నూతన డీజీపీ ఎవరన్న ఉత్కంఠకు దాదాపు తెరపడింది. నూతన డీజీపీగా 1991 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ నియమితులు కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీవీ ఆనంద్ స్థానంలో 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి శిఖాగోయల్ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీవీ ఆనంద్ డీజీపీగా నియమితులవడంపై స్పష్టత వచ్చినట్లయింది అంటున్నారు. ప్రస్తుతం ఇన్చార్జి డీజీపీగా కొనసాగుతున్న బి.శివధర్రెడ్డి ఈనెల 30న పదవీ విరమణ పొందనున్నారు.
ఈ నేపథ్యంలో తదుపరి డీజీపీ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆరుగురు సీనియర్ ఐపీఎస్ల జాబితా నుంచి ముగ్గురిని ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆ జాబితాను పంపింది. అందులో సీవీ ఆనంద్తోపాటు 1994 బ్యాచ్కు చెందిన కేంద్ర సర్వీస్లో ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్గా పనిచేస్తున్న వినాయక్ ప్రభాకర్ ఆప్టే, జైళ్లశాఖ డీజీగా పనిచేస్తున్న సౌమ్యామిశ్రా పేర్లు ఉన్నాయి. అయితే ఈ ముగ్గురి నుంచి రాష్ట్ర కేడర్లో అత్యంత సీనియర్ అయిన సీవీ ఆనంద్ను డీజీపీగా నియమించనున్నట్టు తెలుస్తోంది.


