సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ కన్నుమూత

CPI EX MLA Gunda Mallesh Passed Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ కన్నుమూశారు. గత కొద్దికాలంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిశారు. గుండా మల్లేష్‌ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, కార్యకర్తలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. గుండా మ‌ల్లేశ్ భౌతిక‌కాయాన్ని ప్ర‌జ‌ల సంద‌ర్శ‌నార్థం నారాయ‌ణ‌గూడ‌లోని మ‌క్దూమ్ భ‌వ‌న్‌కు త‌ర‌లించ‌నున్నారు. అనంత‌రం మ‌ల్లేశ్ భౌతిక‌కాయాన్ని ఆయన సొంత ఊరు బెల్లంప‌ల్లికి త‌ర‌లిస్తారు

అంచెలంచెలుగా ఎదిగి..
కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ అంచెలంచెలుగా శాసన సభ్యులు స్థాయికి ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి చెందిన మల్లేశ్ మెట్రిక్యులేషన్ చదివి, బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా పనిచేశారు. తోటి క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాడారు. తర్వాత సింగరేణిలో కార్మికుడిగా చేరిన ఆయన సీపీఐలో సభ్యత్వం తీసుకున్నారు. 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు. మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. 12వ శాసనసభలో 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సీపీఐ సభానాయకుడిగా వ్యవహరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top