
గోవులు స్వేచ్ఛగా తిరుగాడేలా ఉండాలి
స్థలాలను గుర్తించి.. బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేయండి
గోశాలలపై సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
నాలుగైదు రోజుల్లో ఎంకేపల్లి గోశాల తుది డిజైన్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: గోవుల సంరక్షణ సులువుగా ఉండేలా గోశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గోశా లల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి దశలో భాగంగా పశువైద్య విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, వాటి అనుబంధ కళాశాలలు, దేవాలయాల భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. గోశాలల ఏర్పాటు కోసం ప్రత్యేక కమిటీని నియమించాలని, నిర్ణీత గడువులోగా ఈ కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికలతో సిద్ధం కావాలని కోరారు. గోశాలల ఏర్పాటుకు సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలను రూపొందించాలని ఆదేశించారు.
గోవులు స్వేచ్ఛగా తిరిగేలా ఉండాలి
ఇరుకు స్థలాల్లో బంధించినట్టుగా కాకుండా.. గోవులు మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా గోశాలల్లో మార్పులు తేవాలని సీఎం సూచించారు. గోశాలల నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. సమీక్షలో భాగంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించిన పలు డిజైన్లను సీఎం పరిశీలించారు.
షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను సూచించారు. ఈ గోశాల తుది డిజైన్ను నాలుగైదు రోజుల్లో ప్రభుత్వం ఖరారు చేయనుంది. సమావేశంలో సీఎం కార్యాలయ అధికారులు శేషాద్రి, శ్రీనివాసరాజు, మాణిక్రాజ్, అజిత్రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశుపోషణ విభాగం డైరెక్టర్ బి.గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.