
కార్యకర్తలకు పదవులు ఇప్పించడంలో జాప్యం జరిగితే ఎలా?
మీరు ఎంపిక చేసి పంపితే కదా... నేను ఫైనల్ చేసేది
మంత్రులు, పార్టీ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు
కార్యకర్తలను నిరాశకు గురి చేయడం మంచిది కాదు.. ఎవరంటే వారు వచ్చి గాందీభవన్లో ధర్నాలు చేస్తే ఎలా?
అలాచేస్తే ప్రతిపక్షాల చేతికి ఆయుధాలిచ్చినట్టే..
18 నెలల పాలన గోల్డెన్ పీరియడ్ అన్న సీఎం
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపు
హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం బాగా కృషి చేస్తోందన్న మీనాక్షి నటరాజన్
దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్న పీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అటు రాష్ట్ర మంత్రులు, ఇటు పార్టీ నేతలపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి కీలకమైన కార్యకర్తలను నిరాశ పరచడం మంచిది కాదని హితవు పలికారు. ప్రభుత్వ పదవులను కార్యకర్తలకు ఇప్పించడంలో జాప్యం జరిగితే ప్రయోజనం ఏంటని ప్రశ్నించిన రేవంత్.. దేవాలయాల కమిటీలు, మార్కెట్ కమిటీలు లాంటి పదవులు నేరుగా తాను ఇవ్వలేనని, ఇన్చార్జి మంత్రులు షార్ట్లిస్ట్ చేసి పంపితే తాను ఫైనల్ మాత్రమే చేయగలనని అన్నారు. నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీ పదవులు ఇవ్వడంలో ఆలస్యం జరుగుతోందని, ఇలాంటి చర్యల ద్వారా కార్యకర్తలను నిరాశకు గురిచేయవద్దని చెప్పారు.
వీలున్నంత త్వరగా నామినేటెడ్, పార్టీ పదవుల కోసం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జాబితాలను పార్టీకి పంపాలని, పార్టీ నుంచి వచ్చిన జాబితాలను పరిశీలించి నామినేటెడ్ పదవులను ఫైనల్ చేద్దామని అన్నారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ పీఏసీ భేటీ జరిగింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్తో పాటు పీఏసీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్ని కలు, బీసీల కులగణన, ఎస్సీల వర్గీకరణ, సంస్థాగత నిర్మాణం గురించి చర్చించిన ఈ సమావేశంలో సీఎం రేవంత్.. తనదైన శైలిలో పలు వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
వాళ్లను చూసి ఇంకొకరొస్తారు
ఎవరంటే వాళ్లు వచ్చి గాం«దీభవన్లో ధర్నాలు చేస్తే ఆఫీసు నిర్వాహకులు ఏం చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. యాదవ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందంటూ కొందరు యాదవ సంఘాల ప్రతినిధులు గొర్రెలను తీసుకొచ్చి ధర్నా చేయడంపై సీరియస్గా స్పందించారు. పార్టీలో ప్రాధాన్యం కావాలని, మంత్రి పదవులు ఇవ్వాలని ఏ సామాజికవర్గానికి చెందిన వారయినా అడగొచ్చని, తనతో పాటు పార్టీ అధ్యక్షుడికి వినతిపత్రాలు ఇవ్వొచ్చని, డిమాండ్ చేయవచ్చని, కానీ ఓ సామాజిక వర్గం పేరుతో వచ్చి గాం«దీభవన్లో ధర్నా చేయడమేంటని ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రతిపక్షాల చేతికి తామే ఆయుధాలిచ్చినట్టు అవుతుందని అన్నారు. ఇప్పుడు వచ్చిన వారిని చూసి రేపు ఇంకొకరు వచ్చి ధర్నా చేస్తారని, ఇలాంటి ధర్నాలకు గాం«దీభవన్లో అవకాశం ఇవ్వకూడదని అన్నట్టు తెలిసింది.
ఇన్చార్జి మంత్రులు గ్రామాలకు వెళ్లాలి
క్షేత్రస్థాయిలో ఇన్చార్జి మంత్రులు చేయాల్సిన పనులు చేయాలని, లేదంటే గ్రామాలకు వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే తాను వెళ్లడం వల్ల ఉపయోగం లేదని, గ్రామాలకు వెళ్లాల్సింది ఇన్చార్జి మంత్రులేనని స్పష్టం చేశారు. 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గోల్డెన్ పీరియడ్ అని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సంస్థాగత నిర్మాణంపై పీసీసీ దృష్టి సారించాలని చెప్పారు.
‘జూబ్లీహిల్స్’పై చర్చ
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ ఎన్నిక చాలా కీలకమని, ఈ అంశంపై పార్టీ ఫోకస్ చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. అయితే కీలకమే కాదని, ఖచ్చితంగా గెలిచి తీరాలని మీనాక్షి స్పష్టం చేశా రు. ఉప ఎన్నికకు పార్టీ సిద్ధం కావాలని, ఆ నియోజకవర్గంలో చేయాల్సిన అన్ని కార్యక్రమాల రోడ్మ్యాప్ను హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తయారు చేయాలని సీఎం సూచించారు. అభ్యరి్థని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుందని, తామంటే తాము అభ్యర్థులమని ఎవరూ చెప్పకూడదని పీసీసీ అధ్యక్షుడు ఆదేశించారు.
మేనిఫెస్టోలో పెట్టలేదు: భట్టి.. కాదు పెట్టాం: శ్రీధర్బాబు
రేషన్షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా తాము అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. అయితే మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ..మేనిఫెస్టోలో పెట్టామంటూ పుస్తకం చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగానే ఉన్నాయి కానీ, కార్యకర్తలను దృష్టిలో ఉంచుకుని వారికి మేలు చేసే పథకాలు కూడా రూపొందించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు.
పదవులు, ప్రాధాన్యతలో కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి కంటే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పరిగణనలోకి తీసుకోవాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు కోరారు. సమావేశంలో మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు తదితరులు మాట్లాడారు. కాగా టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ రాసిన వ్యాసాల సంకలనం ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’అనే పుస్తకాన్ని రేవంత్, మీనాక్షి ఆవిష్కరించారు.
‘వైఎస్ రచ్చబండ’లాంటి కార్యక్రమం కావాలి
ప్రభుత్వ పరంగా చేసింది చెప్పుకోలేకపోతున్నామని సీనియర్ నేత జెట్టి కుసుమకుమార్ పీఏసీ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన రచ్చబండ లాంటి కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల కారణంగా ఎవరికి లబ్ధి కలుగుతుంది, ఎవరికి కలగడం లేదనే అంశాలపై గ్రామాల్లోనే చర్చ పెట్టాలని సూచించినట్టు సమాచారం. కాగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా అవకాశం లభిస్తుందని మీనాక్షి నటరాజన్ చెప్పారు. ప్రజలకు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోందని అభినందించారు. రాష్ట్రంలో గోల్డెన్ పాలన సాగుతోందని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని మహేశ్గౌడ్ అన్నారు.
ఏఐసీసీ కూడా తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి గణాంకాలతో సహా భట్టి వివరించారు. సమావేశం అనంతరం పీఏసీ నిర్ణయాలను మంత్రి వాకిటి శ్రీ«హరి, ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి భట్టి వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో చేసిన కార్యక్రమాలను పీఏసీ అభినందించిందని, గోల్డెన్ పీరియడ్ అని అభివర్ణించిందని చెప్పారు. బూత్, మండల, జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని, ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలని కూడా పీఏసీ నిర్ణయించినట్లు తెలిపారు.