స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి | CM Revanth Govt Focus on Local Body Elections in Telangana | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి

Jun 17 2025 1:08 AM | Updated on Jun 17 2025 1:08 AM

CM Revanth Govt Focus on Local Body Elections in Telangana

మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయండి 

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై విస్తృత ప్రచారం 

నిర్వహించండి... మంత్రులకు సీఎం రేవంత్‌ సూచన 

జరగని నిర్ణయాలు ముందే చెబితే ప్రజల్లో పలుచన అవుతామంటూ మందలింపు

సాక్షి, హైదరాబాద్‌: జూలైలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తితో ఉన్నారని చెప్పారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని వారు గమనిస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మంత్రులతో, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో సీఎం 45 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు.

జరగని నిర్ణయాలను ముందుగానే ప్రకటించడం వల్ల ప్రజల్లో పలుచన అవుతామని స్థానిక సంస్థల ఎన్నికలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్కలు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి సుతిమెత్తగా మందలించారు. కాగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. మంత్రులు టార్గెట్‌లు పెట్టుకుని మరీ పని చేయాలని, స్థానిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా పర్యటనలో ఉన్న కొండా సురేఖ మినహా మంత్రులందరూ ఈ భేటీకి హాజరయ్యారు.  

ఎన్ని ఎకరాలున్నా రైతుభరోసా!: ప్రస్తుత రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా తదితర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులతో రేవంత్‌ చర్చించినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..ఈనెలాఖరు వరకు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.

రైతు భరోసా విషయంలో రాజీ పడేది లేదని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన సాగుతున్నందున ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా వేద్దామని ఆయన అన్నట్టు సమాచారం. స్థానిక ఎన్నికల గురించి బయట మాట్లాడేదాని కంటే, ప్రజలకు తామిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని వివరించడంపైనే దృష్టి పెట్టాలని అన్నట్టు తెలిసింది. జిల్లా మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు సమన్వయంతో వ్యవహరించాలని, బీఆర్‌ఎస్‌ బలం కొద్దో గొప్పో ఉన్న జిల్లాలపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టి పనిచేయాలని సూచించారని సమాచారం.  

బనకచర్లపై కేంద్రంతో తేల్చుకుందాం.. 
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రంతోనే తేల్చుకుందామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం ప్రీ ఫీజబులిటీ నివేదికను సమర్పించడం, దానికి డీపీఆర్‌ను సమర్పించాలని కేంద్రం కోరడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. బనకచర్లకు అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వద్దామని అన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement