హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో హృదయాలను పిండేసే విషాద ఘటన చోటుచేసుకుంది. గౌలిదొడ్డిలో ఉన్న ‘మహి వుమెన్ పీజీ’లో ఐదేళ్ల చిన్నారిని లిఫ్ట్ బలిదీసుకుంది. ఆడుకుంటూ అమాయకంగా గ్రిల్స్ ఉన్న లిఫ్ట్లోకి వెళ్లిన చిన్నారి బిస్తు సేఫ్ (5) అందులోనే చిక్కుకుపోయింది.
ఆ తర్వాత నొప్పితో తల్లడిల్లిపోయింది. ఆ పసిపాప బయటపడలేకపోవడంతో చివరకు ఆమె ఊపిరి ఆగిపోయింది. జార్ఖండ్కు చెందిన బిస్తు సేఫ్ తన తాత, అమ్మమ్మలతో కలిసి ఆ హాస్టల్లో ఉంటోంది. కళ్లముందే ఆ చిన్నారి ప్రాణం పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
క్షణాల వ్యవధిలో ఆమె జీవితం ఆగిపోవడం.. కుటుంబానికి తట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది. పసిపాప నవ్వులతో మార్మోగాల్సిన ఆ ప్రదేశం ఇప్పుడు విషాదంతో నిండిపోయింది. ఈ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక అమాయక ప్రాణం ఇలా లిఫ్ట్లో ఇరుక్కుపోవడం భద్రతా ప్రమాణాలపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, ప్రతి లిఫ్ట్కి సరైన భద్రతా చర్యలు తీసుకోవడం అత్యవసరం.


