ఏడాది తర్వాత ప్రజా ఆశీర్వాద సభ ద్వారా జనంలోకి కేసీఆర్
గత ఏడాది వరంగల్లో పార్టీ రజతోత్సవ సభకు కేసీఆర్ హాజరు
2023 తర్వాత అడపాదడపా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలు
జగిత్యాల బహిరంగసభ గేమ్ ఛేంజర్ అంటున్న బీఆర్ఎస్
జీవన్రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో పూర్వ వైభవంపై ఆశలు
సాక్షి, హైదరాబాద్ /జగిత్యాల: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుమారు ఏడాది తర్వాత జగిత్యాల సభ వేదికగా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి టి.జీవన్రెడ్డి సోమవారం జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఈ సభను పార్టీ శ్రేణులు జగిత్యాల జైత్రయాత్రగా అభివర్ణిస్తున్నాయి. 2023లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ తిరిగి జగిత్యాల సభతో పూర్వ వైభవం సాధిస్తుందనే ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. బహిరంగసభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు శ్రమిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత...
2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం కేసీఆర్ అడపాదడపా మాత్రమే ప్రజాక్షేత్రంలో కనిపిస్తూ వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తుంటి ఎముక శస్త్ర చికిత్సతో కొద్దినెలలు ఎర్రవల్లి నివాసానికి పరిమితమయ్యారు. కొద్దిగా కోలుకున్న కేసీఆర్ 2024 ఫిబ్రవరి 13న ‘చలో నల్గొండ’పేరిట సభ నిర్వహించారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఈ సభలో మండిపడ్డారు. 2024 ఏప్రిల్, మేలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు రోడ్షోలు, బస్సుయాత్రలో కేసీఆర్ పాల్గొన్నారు.
గత ఏడాది వరంగల్లో ‘రజతోత్సవం’
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి వద్ద ‘రజతోత్సవ సభ’నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ భేటీలో కేసీఆర్ పాల్గొని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉంటున్న కేసీఆర్ ఏడాది తర్వాత జగిత్యాల సభ వేదికగా తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మేడిగడ్డ పర్యటనకు వెళ్తుండటంతో జగిత్యాల సభ వేదికగా కేసీఆర్ చేసే ప్రసంగంపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
జీవన్రెడ్డి చేరికతో కొత్త ఉత్సాహం
నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో అగ్రశ్రేణి నాయకుడిగా పేరొందిన మాజీమంత్రి జీవన్రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతుండటంతో పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీ ఆవిర్భావ సమయం నుంచి పార్టీకి గట్టి పట్టున్న ఉత్తర తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. జీవన్రెడ్డి చేరిక ఉత్తర తెలంగాణలో పార్టీకి కొత్త ఊపునిస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. జగిత్యాల సభ వేదికగా బీఆర్ఎస్ ప్రస్థానం, పదేళ్ల పాలన, కాంగ్రెస్ పాలనావైఫల్యం వంటి అంశాలపై కేసీఆర్ ప్రసంగించే అవకాశముంది. పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేయడంతోపాటు భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ప్రకటిస్తారని భావిస్తున్నారు. జగిత్యాల సభ బీఆర్ఎస్ ప్రస్థానంలో మైలు రాయిగా నిలవడంతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో ‘గేమ్ ఛేంజర్’గా ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
లక్ష మందికి పైగా సభకు వచ్చేలా...
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో జరగనున్న బహిరంగ సభకు లక్షకు పైగానే జనాన్ని తరలించేందుకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను తరలించేలా చర్యలు తీసుకున్నారు. జగిత్యాల సభలో పాల్గొనేందుకు కేసీఆర్ సోమవారం సాయంత్రం 4.45కు ఎర్రవల్లి నివాసం నుంచి బయలుదేరి వెళతారు. సాయంత్రం 5.30 గంటలకు హెలికాప్టర్లో కేసీఆర్ కలెక్టరేట్లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కారులో పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు.
అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరంసాయంత్రం 6 గంటలకు పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి బహిరంగ సభ ప్రాంగణానికి కేసీఆర్ చేరుకుంటారు. సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మినీస్టేడియం పట్టణం నడి»ొడ్డున ఉండటంతో అత్యధికంగా రద్దీ ఏర్పడే అవకాశం ఉండటంతో ఎక్కడికక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ రెండుసార్లు పర్యటించి ప్రజల కోసం 3 లక్షల వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు.


