అమ్మ ఊరు వెళ్లిందన్నారు కదా.. ఎప్పుడు వస్తుంది? | Bhadrachalam Tragic Road Accident Claims Family Of Three, Survivor’s Innocent Question Moves Many | Sakshi
Sakshi News home page

అమ్మ ఊరు వెళ్లిందన్నారు కదా.. ఎప్పుడు వస్తుంది?

Jun 23 2026 8:33 AM | Updated on Jun 23 2026 9:55 AM

Bhadrachalam Road incident

భద్రాచలం అర్బన్‌: ‘అమ్మ ఊరు వెళ్లిందన్నారు కదా.. ఎప్పుడు వస్తుంది?’ అంటూ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, సోదరుడిని కోల్పోయిన ఓ చిన్నారి అడుగుతున్న ప్రశ్న బంధువులు, స్థానికులను కంటతడి పెట్టించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భద్రాచలానికి చెందిన దూడల సాయిప్రకాశ్‌–సంధ్య దంపతులతోపాటు వారి చిన్నకుమారుడు మోక్షిత్‌ మృతిచెందగా సాయిప్రకాశ్‌ తల్లి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 సోమవారం పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను భద్రాచలంలోని సాయిప్రకాశ్‌ కుటుంబం నివసించిన అద్దె ఇంటికి బంధువులు తీసుకెళ్లగా అప్పటికే యజమాని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. యజమానికి స్థానిక సీపీఎం నేతలు సర్దిచెప్పినా ఉపయోగం లేకపోయింది. దీంతో స్థానికులు నివాళులర్పించాక ముగ్గురి మృతదేహాలను సంధ్య స్వస్థలమైన ఏపీలోని పురుషోత్తపట్నం (భద్రాచలం సరిహద్దున ఉన్న గ్రామం) తీసుకెళ్లారు.

 ప్రమాద సమయంలో అమ్మమ్మ ఇంట్లో ఉన్న సాయిప్రకాశ్‌ పెద్ద కుమారుడు రిత్విక్‌ తన తల్లిదండ్రులు, సోదరుడి మృతదేహాలను తీసుకురాగానే వారు మరణించారన్న విషయం తెలియక అమ్మ ఎప్పుడు వస్తుందంటూ పదేపదే అడగడం మొదలుపెట్టాడు. దీంతో బంధువులు అతని దృష్టిమళ్లిస్తూ ఏదో ఒకటి సర్దిచెబుతూ వచ్చారు. సోమవారం సాయంత్రం మృతదేహాలకు దహన సంస్కారాలను రిత్విక్‌తో తాత వెంకటేశ్వరరెడ్డి (సంధ్య తండ్రి) చేయించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement