విద్యార్థుల స్కాలర్‌ షిప్‌ రూ. 20 వేలకు పెంచాలి 

BC Leader R Krishnaiah Comments Over Student Scholarship - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఆదుకోవాలి.. ఎంపీ ఆర్‌.కృష్ణయ్య   

ముషీరాబాద్‌: పెరిగిన ధరల ప్రకారం కాలేజీ కోర్సులు చదివే బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్‌ షిప్‌లను రూ.5,500 నుంచి రూ. 20 వేలకు పెంచాలని, ఫీజు బకాయిలు రూ. 3,300 కోట్లు వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం బీసీ భవన్‌లో రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జి.అంజి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నవంబర్‌ 10న కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా కలెక్టరేట్లు, ఎంఆర్‌ఓ కార్యాలయాల ముందు ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తారని తెలిపారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ రూ. 20 వేలు స్కాలర్‌ షిప్‌ ఇస్తుంటే తెలంగాణలో కేవలం రూ. 5,500 మాత్రమే ఇస్తున్నారని ప్రస్తుత అవసరాలకు రూ. 20 వేలకు పెంచాలని కోరారు. కాలేజీ హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీలను నెలకు రూ.1,500 నుంచి రూ. 3 వేలకు, పాఠశాల హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీలను రూ.1,100 నుంచి రూ.2 వేలకు పెంచాలన్నారు. బీసీలకు జనాభా ప్రకారం అదనంగా మరో 120 బీసీ గురుకుల పాఠశాలలు, 50 డిగ్రీ కాలేజీలు మంజూరు చేయాలని కృష్ణయ్య కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top