– పుదుచ్చేరి మంత్రి శివకొళుందు
సాక్షి, చైన్నె : పుదుచ్చేరిలోని అంగన్వాడీ పిల్లలకు రెండు జతల ఉచిత యూనిఫాం ఇస్తామని, అలాగే మొదటి విడతగా 9 అంగన్వాడీ కేంద్రాలలో చైల్డ్ కేర్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు పుదుచ్చేరి మంత్రి శివకొళుందు అసెంబ్లీలో ప్రకటించారు. పుదుచ్చేరి శాసనసభలో గ్రాంట్ల డిమాండ్లపై సోమవారం నిర్వహించిన చర్చలో మంత్రి శివకొళుందు పలు వివరాలను ప్రకటించారు. అంగన్న్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు కలరింగ్ పుస్తకాలు, కలర్ పెన్సిళ్లు, జ్ఞాపకశక్తిని పెంచే ఫ్లాష్ కార్డులు , పోస్టర్లతో కూడిన విద్యా పరికరాలు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. 12 వేల మందికి రూ. 60 లక్షలతో యూనిఫారాలను కొనుగోలు చేసి రెండు జతల చొప్పున ఇస్తామన్నారు.
పోషకాహార పథకంలో మార్పులు
అంగనన్వాడీ పోషకాహార పథకాన్ని పునరుద్ధరించి, పిల్లలకు ఉదయం టిఫిన్గా రకరకాల మొలకెత్తిన గింజలు, పప్పుధాన్యాలతోపాటు, ప్రతి రోజూ ఉడక బెట్టిన గుడ్డు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. 2–6 ఏళ్ల పిల్లలకు వారానికి రెండుసార్లు సీజనల్ పండ్లు , వారానికోసారి ధాన్యాలతో చేసిన న్యూట్రిషన్ బిస్కెట్లు ఇవ్వనున్నట్టు తెలియజేశారు. అంగన్వాడీలకు వర్తించే 65 రోజుల సెలవు దినాలలో కూడా పిల్లలకు న్యూట్రిషన్ పౌడర్ అందజేస్తామన్నారు.
చైల్డ్ కేర్ సెంటర్లు
తగినంత స్థలం, మౌలిక వసతులు ఉన్న అంగన్వాడీల్లో పిల్లల సంరక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, మొదటి విడతగా ఈ ఏడాదే 9 ప్రాంతాల్లో వీటిని ప్రారంభిస్తామన్నారు. పిల్లలు ఆడుకోవడానికి వీలుగా స్థలం ఉన్న ప్రదేశాన్ని బట్టి ఇనుప ఊయలలు, ఇండోర్ స్లైడ్లు, రైడింగ్ బొమ్మలు , ఇతర ఆట వస్తువులతో కూడిన ప్లే రూమ్లను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. కాగా, సభలో సభ్యుల ప్రశ్నలకు బదులిస్తూ, ఎలాంటి రేషన్ కార్డులను రద్దు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు.


