సాక్షి, చైన్నె: డెల్టా సాగు నిమిత్తం మేట్టూరు జలాశయం నీటిని మంగళవారం విడుదల చేయనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించినానంతరం ప్రపథమంగా విజయ్ సేలం మేట్టూరులో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించి మంత్రి ఆనంద్ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏటా జూన్ 12 మేట్టూరుడ్యాం నుంచి నీటిని సాగుకు విడుదల చేయడం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది నీళ్లు ఆశించిన మేరకు లేక పోవడంతో విడుదల చేయలేదు. ప్రస్తుతం కావేరి తీరంలో కురుస్తున్న వర్షాలతో మేట్టూరు డ్యాం నీటిమట్టం 90 అడుగుల దాటింది. దీంతో మంగళవారం నుంచి సాగు నిమిత్తం నీటిని విడుదల చేయనున్నారు.సీఎం విజయ్ మేట్టూరుకు రాకతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి ఆనంద్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే, తాజాగా విడుదల చేసే నీరు కంటి తడుపు చర్య అని, సాగు నిమిత్తం 155 రోజులు కనీసం నీటిని విడుద ల చేయాల్సి ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కాగా, కావేరి తీరంలోని మేఘదాతు వద్ద డ్యాం నిర్మాణానికి కర్ణాటక చేస్తున్న ప్రయత్నాలను ఇప్పటికే తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తాజాగా ఈ డ్యాంకు వ్యతిరేకంగా పుదుచ్చేరి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించారు. సీఎం విజయ్తో పార్లమెంటరీ కమిటీ భేటి: సచివాలయంలో సోమవారం సీఎం విజయ్తో పార్లమెంటరీ కమిటీ భేటీ అయింది. గృహ, పట్టణ వ్యవహారాలకు సంబంధించిన ఈ కమిటీ సభ్యులు సీఎంతో సమావేశమయ్యారు. సీఎస్ సాయికుమార్, అదనపు ముఖ్య కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడి తదితరులు ఇక్కడి గృహ నిర్మాణ పథకాలు, పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్రాజక్టుల వివరాలను ఆ కమిటీకి వివరించారు.


