సాక్షి, చైన్నె : దక్షిణాది బిగ్ బాస్ అభిమానులకు జియోస్టార్ సరికొత్త ప్రమోను ఆవిష్కరించింది. బిగ్ బాస్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం సీజన్లు సెప్టెంబర్ 6 నుంచి ఒకేసారి ప్రారంభం కానున్న సందర్భంగా, నలుగురు వ్యాఖ్యాతలు విజయ్ సేతుపతి, అక్కినేని నాగార్జున, కిచ్చా సుదీప్, మోహన్లాల్ కలసి నటించిన ఒక ప్రత్యేక ప్రమోను సోమవారం విడుదల చేసింది. బిగ్ బాస్ చరిత్రలోనే దక్షిణాదికి చెందిన ఈ నలుగురు అగ్ర కథానాయకులు ఒకే ప్రమోలో, ఒకే స్క్రీన్పై కనిపించడం ఇదే తొలిసారి కావడం విశేషం.ఈ ప్రమోలో నలుగురు సూపర్స్టార్లు తమ తమ డ్రెస్సింగ్ రూమ్లలో ఎదురుచూస్తుండగా, హోటల్ సర్వర్ల పొరపాటు వల్ల ఒకరి ఆహారం మరొకరికి మారిపోతుంది. ఈ పొరపాటును సర్వరు సరిచేయబోతుండగా, ‘పర్వాలేదు, రుచి అద్భుతంగా ఉంది’ అంటూ నలుగురు హీరోలు ఇతర రాష్ట్రాల వంటకాలను ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తారు. దక్షిణాది సంస్కృతులు, భాషలు వేరైనా బిగ్ బాస్ ద్వారా అందరూ ఒకే వేదికపైకి వస్తున్నారనే భావనను ఈ సరదా సన్నివేశం ద్వారా ప్రమోలో చక్కగా ఆవిష్కరించారు. ఈవిషయం గురించి జియోస్టార్ సౌత్ ఎంటర్టైన్మెంట్ హెడ్ క్రిష్ణన్ కుట్టి మాట్లాడుతూ విజయ్ సేతుపతి, నాగార్జున, కిచ్చా సుదీప్, మోహన్లాల్లను వారి సంస్కృతితికి అద్దం పట్టేలా ఒకే వేదికపైకి తీసుకురావడం తమకు లభించిన మంచి అవకాశంగా పేర్కొన్నారు.


