సాక్షి, చైన్నె : అసెంబ్లీలో శాసనసభలో దివ్యాంగుల సంక్షేమ శాఖకు సంబంధించి మంత్రి జగదీశ్వరి 9 కీలక ప్రకటనలు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేక వాహనాల పంపిణికి రూ. 4 కోట్లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో రూ. 1.82 కోట్లతో 10 గృహాల ఏర్పాటు 1.77 కోట్లు వైకల్యంతో ఉన్న వారి కోసం 10 వృత్తి శిక్షణా కేంద్రాల ఏర్పాటు ప్రకటనలు ఇందులో ఉన్నాయి. అలాగే, ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం విస్తరించారు. నగర, పట్టణ లో–ఫ్లోర్, ఎక్స్ప్రెస్, డీలక్స్, సబర్బన్, ఇతర ప్రాంత బస్సులలో తమతో పాటు ఒకవ్యక్తిని తోడుగా తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
స్పీకర్ జె.సి.టి. ప్రభాకర్ ఆదేశాలు
సభ నుండి తొలగించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వస్తున్నాయని డీఎంకే మాజీ మంత్రి కేఎన్ నెహ్రూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్ జె.సి.టి. ప్రభాకర్ స్పందిస్తూ, సభ్యులు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని, రికార్డుల్లోకి ఎక్కకూడని వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. అదే సమయంలో జల్లికట్టు విషయంగా టీవీకే ఎమ్మెల్యే కరుప్పయ్య చేసిన వ్యాఖ్యలపై సభా రికార్డుల నుండి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
టాస్మాక్ సిబ్బందికి వేతనాల పెంపు
టాస్మాక్ మద్యం దుకాణాలలోని ఉద్యోగులకు వేతనాల పెంపుతో పాటు రూ. 20,000 పండుగ అడ్వా న్స్ ఇస్తున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. అలాగే సెమ్మంజేరి క్రీడా నగరం విషయంగా సభలో మంత్రి ఆదవ్ అర్జున, ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ స్పోర్ట్స్ సిటీ ప్రాజెక్ట్ను రద్దు చేయలేదని, అంతర్జాతీయ, పారాలింపిక్ ప్రమాణాలకు అనుగుణంగా దాన్ని పునర్నిర్మిస్తున్నామని సభకు ఆదవ్ స్ప ష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో 10 ప్రపంచ స్థాయి ఒలింపిక్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా, నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి మోదీ తిరిగి తీసుకువచ్చిన చోళుల కాలం నాటి ఆనైమంగళం రాగి ఫలకాలను తమిళనాడులోని నాగపట్టణానికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రాజ్మోహన్ తెలిపారు. కాగా, అసెంబ్లీలో ఉచిత,చీర ధోవతి అంశం పెద్ద చర్చకే దారి తీసింది. ఇప్పటికే చేనేత కార్మికులు రూ. 50 కోట్లు విలువైన ఉత్పత్తిని పూర్తి చేసి ఉన్న తరుణంలో, తాజాగా 8 అంగుళాలకు బదులుగా నాలుగు అంగులాలకు పంచెను పరిమితం చేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. అయితే, మంత్రి విజయ్ బాలాజీ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ఒకే రకమైన పంచె ,చీర పంపిణి చేస్తున్నారని, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నాలుగు అంగుళాలతో తెల్లటి పంచె, జరి చీర అందించనున్నామని ప్రకటించారు. కాగా, అసెంబ్లీలో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేతగా ఉన్న తారగై కాఠ్పత్కు ముందు వరసలో తాజాగా సీటు కేటాయించారు. కాగా, డీఎంకే ఎమ్మెల్యే, మాజీ సీఎం పన్నీరు సెల్వం సభలో రహదారుల విషయంగా ప్రశ్నలు సందిస్తూ, రవాణా శాఖ మంత్రి సమాధానం ఇవ్వాలని పొరబాటున చేసిన వ్యాఖ్య సభలో నవ్వులు పూయించాయి.


