వేలూరు: మధుమేహ వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వేలూరు ఇండియన్ రెడ్క్రాస్ కార్యదర్శి ఉదయశంకర్ అన్నారు. రెడ్క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలూరు పాత బస్టాండ్ సమీపంలోని ఇండియన్ రెడ్ క్రాస్ కార్యాలయ ఆవరణలో రెడ్క్రాస్ సంస్థ, వేలూరు సీఎంసీ ఆస్పత్రి, సంయుక్తంగా మధుమేహ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం, వైద్యశిబిరం నిర్వహించారు. సీఎంసీ ఆస్పత్రి వైద్యులు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఫాస్ట్ఫుడ్లకు అలవాటు పడకుండా పారంపర్య ఆహారాలను తీసుకోకలిగితే మధుమేహ వ్యాధి నుంచి బయట పడొచ్చన్నారు. వేపాకును ఉపయోగించి ఇతర దేశాల్లో మధుమేహ వ్యాధికి మందుగా పొడిచేసి ఇస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ చేదు రుచికి కూడా అలవాటు పడాలన్నారు. మధుమేహ వ్యాధిలో చైనా మొదటి స్థానంలో ఉండగా ఇండియా రెండవ స్థానంలో ఉందన్నారు. రెడ్క్రాస్ కార్యదర్శి పర్వద, కోశాధికారి పాండియన్, సభ్యులు ఇంద్రనాథ్, వేల్మురుగన్, మేనేజర్ దీపన్, సీఎంసీ ఆస్పత్రి వైద్యులు నిత్య, సెల్వి, హరిణి పాల్గొన్నారు.
తిరుత్తణి: తిరుత్తణి కొత్త బస్టాండులో దుకాణాల వేలం డిపాజిట్ తగ్గించాలని మున్సిపల్ కమిషనర్కు వ్యాపారులు డిమాండ్ చేశారు. తిరుత్తణిలో కొత్త బస్టాండు నిర్మాణపు పనులు పూర్తి కావడంతో ఎన్నికలకు ముందు బస్టాండు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో కొత్త బస్టాండులోని 24 దుకాణాలకు వేలం నిర్వహించారు. దుకాణాలను వేలం ద్వారా దక్కించుకునేందుకు వీలుగా మున్సిపాలిటీ కమిషనర్ దుకాణానికి డిపాజిట్గా రూ.4 లక్షలు చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు. ఈ క్రమంలో 24 దుకాణాలకు వేలంలో 6 దుకాణాలకు మాత్రం డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ కన్నియప్పన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో డిపాజిట్తోపాటు నెల అద్దె కనీసం రూ.10 వేలు ప్రభుత్వం ప్రకటించింది. 6 దుకాణాలకు మాత్రం డిపాజిట్ చెల్లించి వ్యాపారులు వేలం పాటలో పాల్గొన్నారు. తక్కిన 18 దుకాణాలకు వేలంలో వ్యాపారులు పాల్గొనకపోవడంతో మరో తేదీ వేలానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొత్త బస్టాండులో ప్రయాణికుల సంఖ్య తక్కువగా వుంది. చిన్న దుకాణాలు మాత్రమే వుంచి వ్యాపారం చేసే చిరు వ్యాపారులు డిపాజిట్ రూ.4లక్షలతోపాటు నెలకు అద్దె రూ.10వేలు చెల్లించి వ్యాపారం చేయడం అతికష్టం. దీంతో డిపాజిట్ సొమ్ము తగ్గించడంతో పాటు అద్దె సైతం తగ్గించాలని వ్యాపారులు మున్సిపాలిటీ కమిషనర్కు వ్యాపారులు డిమాండ్ చేశారు.
తిరుత్తణి: రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి విజయ్ అమలు చేయాలని అగ్రీ గ్రీవెన్స్లో రైతులు కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించి విజయ్ సీఎంగా పదవీ చేపట్టారు. ఈ క్రమంలో తొలిసారిగా తిరుత్తణి ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం అగ్రీ గ్రీవెన్స్ నిర్వహించారు. ఆర్డీఓ కణిమొళి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సబ్ డివిజన్లోని పలు గ్రామాల నుంచి రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా సీఎంగా పదవీ స్వీకరించిన విజయ్కు రైతులు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న చెరుకు టన్నుకు రూ.4,500, వరి క్వింటాల్ రూ.3,500 అందజేయాలని, సహకార సంఘాల్లో రైతులు పొందిన పంట రుణాలు మాఫీ చేయాలి, రైతులు పంట సాగుకు ఏడాదికి రూ. 15 వేలు అందజేయాలి, సంట బీమా పూర్తిగా ప్రభుత్వం చెల్లింపు సహా రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే డీబీసీ ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు నిర్మూలించి పారదర్శకంగా రైతుల నుంచి వరి కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
కారపాక్కంలో
భారీ అగ్ని ప్రమాదం
తిరువొత్తియూరు: చైన్నె శివారులోని షోళింగనల్లూరులోని కారపాక్కంలో ఉన్న ఓ ప్రైవేటు ఐ టీ సంస్థకు చెందిన గోడౌన్లో శుక్రవారం సా యంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వ్యాపించి దట్టంగా పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమించారు. ఈ మంటల కారణంగా పక్క పక్కనే ఉన్న ఐటీ సంస్థల సిబ్బంది బయటకు పంపించేశారు.


