25కు చేరిన మరణాల సంఖ్య
సుమోటోగా స్వీకరించాలని కోర్టులో పిటిషన్
బాధితులకు నైనార్ పరామర్శ
దర్యాప్తునకు ప్రత్యేక అధికారి
విచారణ ముమ్మరం
25 మంది కార్మికుల ప్రాణాలను బలిగొన్న భారీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించడమే కాకుండా, వ్యవహారం కోర్టుకు చేరడంతో అధికారులు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి సంస మేనేజింగ్ డైరెక్టర్ గోవింద రావును ప్రత్యేక విచారణ అధికారిగా నియమించారు. విరుదునగర్ చేరుకున్న చేరుకున్న గోవిందరావు సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని స్వయంగా సందర్శించారు. పేలుడు ఎలా సంభవించింది? అక్కడ భద్రతా నిబంధనలు పాటించారా? లేదా? అనే కోణంలో ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం విరుదునగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుగపుత్ర సమక్షంలో బాణసంచా తయారీదారుల సంఘం ప్రతినిధులతో ప్రత్యేక అధికారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
సాక్షి, చైన్నె: విరుదునగర్ జిల్లా కట్టనార్పట్టిలో జరిగిన బాణసంచా ఫ్యాక్టరీ పేలుడులో మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న మరో ఇద్దరు మహిళలు సోమవారం మరణించారు. వీరిద్దరినీ సేర్వైకారన్ పట్టికి చెందిన పేచ్చియమ్మాల్ (51), తిరుత్తంగల్కు చెందిన పంచవర్ణం (56)గా గుర్తించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ భారీ పేలుడులో రాత్రి వరకు 23 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారణ అయ్యింది. తాజాగా ఈ ఇద్దరి మరణంతో మొత్తం మృతుల సంఖ్య 25కు చేరింది. మరణించిన వారిలో ఇప్పటివరకు 21 మందిని గుర్తించగా, మిగిలిన 4 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. ఈ ఘోర ప్రమాదంతో విరుదునగర్ పరిసర గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది. బాధితులను ఆదుకోవాలని ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలను పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విరుదునగర్ ఆస్పత్రి వద్ద మంత్రులు తంగం తెన్నరసు, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ తదితరులు తిష్ట వేశారు. అధికారులతో సంప్రదింపు జరుపుతూ, మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం బాధితులకు అప్పగించే దిశగా ముందుకెళ్లారు.
కోర్టుకు వ్యవహారం..
విరుదునగర్ సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విచారణ చేపట్టింది. ఈ ప్రమాదాన్ని కోర్టు సుమోటోగా స్వీకరించి విచారించాలని న్యాయవాది కరుణానిధి కోరారు. న్యాయమూర్తులు సతీష్కుమార్, జ్యోతిరామన్ ధర్మాసనం ముందు ఉదయం ఈ అభ్యర్థన వచ్చింది. ఎన్నికల సమయం కావడంతో అధికారులు, నేతలు ఎవరూ ప్రమాద స్థలాన్ని సందర్శించడం లేదని, బాధితులకు సరైన పరిహారం కూడా ఇంకా అందలేదని న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు,‘ఇప్పటికే ఈ అంశంపై ఒక కేసు నమోదైందని, ప్రభుత్వం కూడా నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. బాధితులకు పరిహారం అందించడంలో జాప్యం ఎందుకు జరుగుతోంది?అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన, ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు బదిలీ కావడంతో వివరణ ఇవ్వడానికి సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు. నిని అంగీకరించిన న్యాయమూర్తులు, పరిహారం చెల్లింపుపై పూర్తి వివరాలతో మంగళవారం నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
కఠిన చర్యలు అవసరం
సాత్తూరు, శివకాశి ప్రాంతాల్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడం దురదృష్టకరమని, వీటిని అరికట్టడానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ అండదండలతో కొందరు నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారు చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఏ పార్టీ వారైనా సరే, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు ప్రస్తుతం ఇచ్చే పరిహారాన్ని మరింత పెంచాలని ఆయన కోరారు. అలాగే ఫ్యాక్టరీ యజమానులు , కార్మికులు ఇద్దరూ అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు.
కట్టనార్పట్టి పేలుడు ఘటనతో మిన్నంటిన రోదనలు
కార్మికులకు శిక్షణ తప్పనిసరి
ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు బాణసంచా కార్మికులకు వృత్తిపరమైన శిక్షణ తప్పనిసరిగా ఇవ్వాలని, పరిశ్రమ నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. మృతుల కుటుంబ సభ్యులతో కూడా గోవింద రావు చర్చలు జరిపారు. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పరిహారం ప్రక్రియలో కొన్ని సాంకేతిక అంశాలు ఉన్నాయని, అయితే వీలైనంత త్వరగా బాధితులకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.


