బాధ కలుగుతోందని వ్యాఖ్య
సాక్షి,చైన్నె: తమిళులు ద్రవిడ సిద్ధాంతానికి తప్పా,మరో సిద్ధాంతానికి తలొగ్గరని ఏఐసీసీ నేత రాహుల్ గాంఽధీ వ్యాఖ్యానించారు. ఎంతో బలమైన శక్తిగా ఉన్న అన్నాడీఎంకే నేత బానిసగా మారడండటం చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కన్యాకుమారి జిల్లాలో ఉదయం పర్యటించిన రాహుల్ గాంధీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, రాష్ట్రంలోని అన్నాడీఎంకే తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే, తూత్తుకుడి జిల్లా శ్రీ వైకుంఠం, తిరునల్వేలి నాంగునేరిలలో సాయంత్రం జరిగిన సభలోనూ ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యల తూటాలను పేల్చారు. బీజేపీ ఒకే దేశం, ఒకే భాష, ఒకే చరిత్ర నినాదంతో ముందుకెళ్తోందన్నారు. తమిళ భాషకు సుదీర్ఘమైన చరిత్ర ఉందన్నారు. ఢిల్లీ నుండి తమిళనాడును పాలించాలని వారు కలలు కంటున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
అన్నాడీఎంకే – బీజేపీకి ఒక సాధనం
తమిళనాడులో ఒకప్పుడు బలంగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు బానిసగామారి ఉందన్నారు.ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితిని చూస్తుంటే బాధ కలుగుతోందన్నారు. తమిళనాడు అభివృద్ధిలో గతంలో కీలక పాత్ర పోషించిన అన్నాడీఎంకేను ఇప్పుడు బీజేపీ చేజిక్కించుకుందన్నారు. ఆ పార్టీ నేతలు అవినీతిలో కూరుకుపోయి ప్రధాని మోదీకి లొంగిపోయారని పేర్కొన్నారు.. బీజేపీ తమిళనాడులోకి ప్రవేశించడానికి అన్నాడీఎంకే ఒక సాధనంలా ఉపయోగపడుతోందని ఆయన ఆరోపించారు. ద్రవిడ సిద్ధాంతాన్ని అసహ్యించుకునే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తమిళులు ఎన్నటికీ అంగీకరించరని, వారికి లొంగిపోరని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే 10 ఏళ్లు ఆగాల్సిన అవసరం లేదని, తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికలు కేవలం అధికారం కోసం కాదని, తమిళనాడు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటమని ఆయన ఉద్ఘాటించారు. బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సమరం అని వ్యాఖ్యలు చేశారు.


