సాక్షి, చైన్నె: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైన్నె విభాగం ఆధ్వర్యంలో ‘బియాండ్ జనరేషనన్స్ – ద స్ట్రెంగ్త్ ఆఫ్ లెగసీ – హెరిటేజ్’ అనే అంశంపై స్ఫూర్తిదాయకమైన చర్చా కార్యక్రమం జరిగింది. ఆ విభాగం చైన్నె ఛైర్పర్సన్ డాక్టర్ అమూల్య రావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి బరోడా మహారాణి రాధికా రాజే గైక్వాడ్, అపోలో హాస్పిటల్స్ వైస్ ఛైర్పర్సన్ డాక్టర్ ప్రీతా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వారసత్వం – ఆధునికతపై చర్చ
తరతరాలుగా వస్తున్న విలువలు, సంప్రదాయాలను ఆధునిక కాలానికి అనుగుణంగా ఎలా మలచుకోవాలనే అంశంపై ఈ ఇద్దరు ప్రముఖ మహిళా అతిథులు తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.రాధికా రాజే గైక్వాడ్ తన ప్రసంగంలో వారసత్వం అనేది కేవలం ఒక బిరుదు కాదు, మనకంటే గొప్పదైన ఒక సంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించే బాధ్యత అని పేర్కొన్నారు. ఒక తరం గనుక మన సంప్రదాయాలను పాటించడం ఆపివేస్తే, అవి శాశ్వతంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. సంప్రదాయం అనేది బ్రతికి ఉండాలి, కాలానికి అనుగుణంగా మారాలి, పర్యాటకం అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది మన సంస్కృతిని కాపాడుతూ ఎంతోమందికి జీవనోపాధిని అందిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2026–2027 సంవత్సరానికి సంబంధించిన ‘ఫ్లో కనెక్ట్’ మిషనన్ రాజే, డాక్టర్ ప్రీతా రెడ్డి సంయుక్తంగా విడుదల చేశారు.


