కోయంబత్తూరు ఉత్తరం నియోజకవర్గం మరో వీఐపీ స్థానం. ఇక్కడ బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ పోటీ చేస్తున్నారు. ఆమె కోయంబత్తూరు దక్షిణం నుంచి తాజగా ఉత్తరంకు మకాం మార్చుకున్నారు. వాస్తవానికి ఈ స్థానం అన్నాడీఎంకే కంచుకోట. ఈసారి పట్టుబట్టి మరీ ఈ సీటును వానతీ శ్రీనివాసన్ దక్కించుకున్నారు. మరుద మలయం మురుగన్ ఆలయం కొలువైన ఈ స్థానంలో మొత్తం ఓటర్లు: 2,96,939, వీరిలో పురుషులు: 1,45,849, మహిళలు: 1,51,061, ఇతరులు 29 మంది ఉన్నారు. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ అభ్యర్థిగా వీఐపీ వానతీ శ్రీనివాసన్ ఇక్కడ పోటీలో ఉన్నప్పటికీ హఠాత్తుగా ఏర్పడ్డ అనారోగ్య కారణాలతో ఆమె ఆస్పత్రిలో కొన్నాళ్లు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆమెకు మద్దతుగా బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై మొదలు కీలక నేతలు ఇక్కడ తిష్ట వేసి ప్రచారంలో నిమగ్నం కావడం విశేషం. గత ఎన్నికలలో కేవలం 4 వేల ఓట్లతో ఓటమి పాలైన దురై సెంతమిళ్ సెల్వన్ ఈ సారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికలలో ఓడిన తనకు ఈ సారి ఓటర్లు పట్టం కట్టడం ఖాయం అన్న ధీమాతో ఉన్నారు. బీజేపీ, డీఎంకే అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో సముజ్జీలుగా ఉండటంతో సమరం హోరాహోరీగా మారింది. ఇక, ఓట్ల చీలిక దిశగా ఎన్టీకే అభ్యర్థి నర్మద మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విజయ్ టీవీకే అభ్యర్థిగా సంపత్ కుమార్ పోటీలో ఉన్నారు.
ఉత్తరం అభ్యర్థులు: దురై సెంతమిళ్ సెల్వన్(డీఎంకే), వానతీశ్రీనివాసన్(బీజేపీ), నర్మద(ఎన్టీకే), సంతప్కుమార్(టీవీకే)


