సాక్షి, చైన్నె: పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన వీగి పోవడం డీఎంకేకు దక్కిన సగం విజయం మాత్రమేనని, మిగిలిన సగం విజయం ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమిని గెలిపించడం ద్వారానే సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తిరుచెంగోడ్ నియోజకవర్గ కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి అభ్యర్థి ఈశ్వరన్కు మద్దతుగా ఆయన శనివారం ప్రచారం నిర్వహించారు.నామక్కల్లో సీఎం స్టాలిన్ నల్ల చట్టం (డీలిమిటేషన్) ప్రతిని తగులబెట్టారని గుర్తు చేస్తూ, ఆ సెగ దేశమంతటా వ్యాపించి, చివరకు పార్లమెంటులో ఆ బిల్లు వీగిపోయేలా చేసిందన్నారు. ఇది తమిళనాడు పోరాటానికి దక్కిన విజయం.గా వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన వెంటనే సీఎం స్టాలిన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై సంతకం చేశారని గుర్తు చేశారు. పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, 10 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ వంటి పథకాలను అమలు చేశామని తెలిపారు. గత ఐదేళ్లలో కేంద్ర బడ్జెట్లో తమిళనాడుకు ఒక్క పథకం కూడా ఇవ్వలేదని, అసలు శ్రీతమిళనాడుశ్రీ అనే పేరే బడ్జెట్లో కనిపించలేదని మండిపడ్డారు. అందుకే బీజేపీ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఎడప్పాడి పళనిస్వామి బీజేపీకి తీవ్ర బానిసగా మారి పోయారన్నారు.


